చెప్పిందే చేస్తాను, చేయగలిగిందే చెబుతాను. ఇదీ జగన్ నినాదం. ఆయన ఇచ్చిన హామీలు కూడా ఆచరణలో నెరవేర్చగలిగేవే ఇచ్చారు. ఇక పాలనాపరమైన విషయాల్లోనూ అదే విధానం జగన్ అనుసరిస్తున్నారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, తాను ఏం చేయగలిగేది తెలియచేయడం ఇదే జగన్ పాలసీగా పెట్టుకున్నారు.
అమెరికా పర్యటనలో కూడా జగన్ ఇదే విధంగా పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటున్నారు. ఏపీలో అన్ని వనరులు ఉన్నాయి. ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది. అనుమతుల విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టం, దరఖాస్తు అలా పడేయండి. అనుమతులు అవే నడచుకుని మీ దగ్గరకే వస్తాయి ఇదీ జగన్ చెబుతున్న మాట.
గత ప్రభుత్వం సింగిల్ విండో అంటూ చెప్పి బోల్తా కొట్టించిన విషయాలు, తమ పర తేడా చూసి స్వజనులకు చేసిన మేళ్ళు తలచుకుని బెదిరిపోతున్న పారిశ్రామిక వేత్తలకు జగన్ ఇస్తున్న భరోసా ఇదే. సర్కార్ మీతో ఫ్రెండ్లీగా ఉంటుంది. మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు కాళ్ళు అరిగేల తిరగనవసరం లేదు. ప్రభుత్వమే అన్నీ చేసి పెడుతుంది. మీరు మాత్రం మంచి విజన్ తో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి రండి అంటున్నారు జగన్.
మరి జగన్ ఎంచుకున్న ఈ ఫ్రెండ్లీ పాలసీ బడా పారిశ్రామిక వేత్తలను కదిలిస్తుందనుకోవాలి. ఎందుకంటే జగన్ సొంతంగా తాను ఓ పారిశ్రామికవేత్త. ఆయన వ్యాపారం చేసి వచ్చారు. అందులోని మెలకువలు ఆయనకు బాగా తెలుసు. మరి ఎవరికి ఏం కావాలో ఏం వద్దో కూడా జగన్ కి తెలుసు. అందువల్లనే ఆయన మంచి పారిశ్రామిక పాలసీని రూపకల్పన చేస్తానని అంటున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఏపీకి క్యూ కడితే నవ్యాంధ్ర గొప్ప రాష్ట్రంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఆ దిశగానే జగన్ ప్రయత్నాలు కూడా ఉన్నాయి.