ప్చ్.. అవే డైలాగ్ లు ఇంకెన్నాళ్లు పవనూ.. ?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయిల సినిమా జీవితాన్ని రాజకీయాల కోసం వదిలేసుకున్నాడు. కాదనలేం, కానీ ఎందుకో ఇప్పటికి కూడా పవన్ రాజకీయ నాయకుడిగా మారలేకపోతున్నాడు. రాజకీయ నాయకుల్లో ఎవరైనా తమ పర్సనల్ విషయాల కన్నా తమ పని గురించి, ప్రతి పక్షాల వైఫల్యాల గురించే ఎక్కువుగా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా సొంత డబ్బా కొట్టుకోరు. కొట్టుకున్నా ఎవరూ పట్టించుకోరు అనే కనీస అవగాహన వారికి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ కి ఆ అవగాహన లేదేమో అనిపిస్తోంది. సమావేశం ఏదైనా తన సొంత విషయాలను వెల్లడించాల్సిందే. తన సొంత డబ్బా కొట్టుకోవాల్సిందే. ఆ మాట కొస్తే తనకన్నా గొప్ప రాజకీయ నాయకుడే లేడు అని పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతుంటారు. ఇటీవలె విజయవాడలో జనసేన కార్యకర్తలతో సమావేశం అయిన పవన్ కళ్యాణ్ తనకు సంబంధించిన కొన్ని విషయాలను చాల గొప్పగా సెలవిచ్చారు. తను సినిమా రంగంలోకి అనుకోకుండా వచ్చానని, రాజకీయాలలోకి కూడా అలానే వచ్చానని, దేశ సేవ నిమిత్తం ఇక పై సినిమాలు చేయకుండా ప్రజల సేవ చేస్తానని తెలియ చేసారు.
అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీలాగా జనసేన పార్టీని ఎందులోనూ విలీనం చేసేదే లేదని, తలకి తుపాకీ గురిపెట్టిన విలీనం చేయనని.. ఇలా విలీనం మీద పదే పదే వ్యాఖ్యలు చేయడం, ఎక్కడికి వెళ్లిన ఓటమి పై గల కారణాలని మాత్రమే చెప్పడం వలన జనసేన పార్టీ నేతలు కూడా కంగారు పడుతున్నారు. అసలు వెళ్లిన ప్రతి చోట ఎం చేయాలి అనుకుంటున్నారో, తమ ఎజెండా ఏంటో ఇప్పటికీ జన సైనికులకు తెలియక తికమక పడుతున్నారు. నిజానికి రెగ్యూలర్ గా పవన్ స్పీచ్ లను ఫాలో అయ్యేవారికి పవన్ మాటలు పరమ బోర్ కొడతాయి. ప్రతి సమావేశంలోనూ ఇవే డైలాగ్ లా ? కనీసం కొత్త డైలాగ్ లు చెప్పినా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాగే రొటీన్ డైలాగ్ లతో పవన్ రాజకీయం చేస్తే.. రాజకీయనాయకుడిగా హిట్ అందుకోవడం కష్టం అని నెటిజెన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఒక్కటి మాత్రం స్పష్టం.. ప్రజలు ఎపుడూ తమకు సేవ చేసే నాయకుడి కోసమే ఎదురు చూస్తారు. వారిని మాత్రమే గెలిపిస్తారు.