టార్గెట్ కవిత. లోక్ సభ ఎన్నికల సమయంలోనే కాదు.. ఇప్పుడు కూడా ఆమెనే బీజేపీకి లక్ష్యంగా మారారు. టీఆర్ ఎస్కు కౌంటర్ ఇవ్వాలన్నా... సవాల్ చేయాలన్న కవితను టార్గెట్ చేస్తున్నారు కమలనాథులు. ఐతే... తెలంగాణ ఆడబిడ్డను అవమానించేలా మాట్లాడితే... తామేంటో చూపిస్తామని కౌంటర్ ఇస్తున్నారు గులాబీ నేతలు
తెలంగాణలో బీజేపీ వాయిస్ పెంచింది. అధికార పార్టీ టార్గెట్గా దూకుడు పెంచింది. ముఖ్యంగా కేసీఆర్ కూతురు కవితను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తోంది. సభ ఏదైనా, సందర్భం ఏదైనా... కమలనాథుల లక్ష్యం మాత్రం కవితే.
మొన్నటి ఎంపీ ఎన్నికల నుంచి.. ఇప్పటి వరకూ సమయం దొరికినప్పుడల్లా కవితను లక్ష్యంగా చేసుకొని పంచ్లు విసురుతున్నారు నేతలు. రాష్ట్రస్థాయి నేతల నుంచి జిల్లా నేతల వరకూ... కేసీఆర్ కూతురిని టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓడిపోవడమే బీజేపీకి ప్రధాన అస్త్రమైంది. పసుపు రైతుల ఆందోళనలు ఢిల్లీకి చేరడం.. రైతులు సైతం ఎన్నికల్లో నిలబడటం టీఆర్ఎస్ నిజామాబాద్ లో ఓటమికి కారణం. దీన్నే ఎత్తిచూపుతూ బీజేపీ టీఆర్ఎస్ పై హాట్ కామెంట్లు చేస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా చేసిన ఈ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్.. అసలు తెలంగాణలో బీజేపీ ఎక్కడుందంటూ ప్రశ్నించారు. కమలనాథులు హైదరాబాద్ దాటిరారంటూ విమర్శలు చేశారు.
కేటీఆర్ కామెంట్లకు .. తెలంగాణ బీజేపీ నేతలు కూడా గట్టి కౌంటరే ఇచ్చారు. సిస్టర్ సెంటిమెంట్ ను టచ్ చేస్తూ ఎదురుదాడికి దిగారు. బీజేపీ ఎక్కడుందో కవితను అడగాలంటూ కేటీఆర్కు రిప్లై ఇచ్చింది కమలం పార్టీ. ఆడబిడ్డని చూడకుండా బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా వివాదంలోకి లాగుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు మాటలు ఆపి, తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తానికి... తెలంగాణ రాజకీయం రక్తి కట్టిస్తోంది. పార్టీల మధ్య హాట్ హాట్ కామెంట్లతో రాజకీయం నడుస్తోంది.