దేశంలో మోడీకి మద్దతు పెడుతూనే ఉన్నది. 2014-2019 కంటే.. 2019 నుంచి మోడీకి మద్దతు అనూహ్యంగా పెరిగిపోతున్నది. మోడీని సొంతపార్టీ నేతలే కాకుండా ప్రతిపక్షంలో ఉన్న నేతలు కూడా మద్దతు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు మోడీకి బహిరంగంగా మద్దతు ఇచ్చారు. అంతేకాదు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హుడా కూడా మద్దతు పలికిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ లిస్ట్ లో జైరాం రమేష్ కూడా చేరిపోయారు. జైరాం రమేష్ ఢిల్లీలో ఈ విషయంపై మాట్లాడారు. మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన్ను ప్రజలకు దగ్గరయ్యేలా చేస్తున్నాయని, ప్రజామోదయోగ్యమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారని అన్నారు. ఆర్ధిక, రాజకీయ, రక్షణ రంగాల్లో మోడీ తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఆయన్ను గొప్పనాయకుడుగా నిలబెట్టాయని అన్నారు.
ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పధకం ప్రధానికి కలిసి వచ్చిందని, ఈ పధకం ఆయన్ను ప్రజలకు మరింత చేరువ చేసిందని అన్నారు. 2019 ఎన్నికల్లో 37శాతానికి పైగా ఓట్లతో మళ్లీ అధికారంలోకి రాగలగడం వంటివాటిని పరిగణనలోకి తీసుకొని మోదీని గుర్తించాల్సిన అవసరం ఉందని జైరాం రమేష్ చెప్పడం విశేషం. జైరాం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపించబోతున్నాయి.
జైరాం రమేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. అసలే కాంగ్రెస్ పార్టీ దేశంలో క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటోంది. ప్రతి రాష్ట్రంలోనూ ఇబ్బందులు పడుతున్నది. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కూడా మోడీకి పరపతి పెరుగుతుండటంతో ఏం చేయాలో కాంగ్రెస్ పార్టీకి తోచడం లేదు. బలమైన నాయకత్వ లోపం కాంగ్రెస్ పార్టీని పట్టిపీడిస్తోంది.మరోవైపు పార్టీని ముందుకు తీసుకెళ్తాడని భావించిన రాహుల్ గాంధీ తన పదవినుంచి తప్పుకోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఒక్క జైరాం రమేష్ మాత్రమే కాదు.. ఇంకా చాలామంది ఇలా బయటకు చెప్పలేకపోయినా.. మోడీపై అభిమానాన్ని చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే 2024 లోను మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.