రాజధానిపై సమయం వచ్చినప్పుడు అన్ని వ్యవహారాల్ని బయటపెడతామని ప్రకటించిన మంత్రి బొత్స...
గత వారం రోజులుగా రాజధాని పై రచ్చకు కేంద్ర బిందువుగా మారిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏమాత్రం తగ్గట్లేదు. అమరావతిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. సమయం వచ్చినప్పుడు అన్ని వ్యవహారాల్ని బయటపెడతామని ప్రకటించారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగింది కనుకే దాని గురించి చెప్పానంటూ మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బదులుగా చెప్పారు. రాజధానిపై ఇప్పుడు మాట్లాడుతున్న బిజెపి నేతలు పవన్ కల్యాణ్ గతంలో ఏం మాట్లాడారో గుర్తించుకోవాలన్నారు. అమరావతిలో తనకు సెంటు భూమి లేదని చెబుతున్న మాజీ కేంద్ర మంత్రి గట్టిగా సవాల్ చేస్తే ఆయన భూములు ఎక్కడున్నాయో చూపిస్తామన్నారు బొత్స.
ఏ ఒక్క సామాజిక వర్గం కోసమో, ఎవరికోసమో ప్రభుత్వం ఉండదు, మేము 5 కోట్ల ప్రజలకి మరియు ప్రభుత్వానికి సమాధానం ఇస్తాం వేరే ఎవరికో ఇవ్వం అని ఆయన అన్నారు. రాజధానికి చెందిన పలువురు రైతులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలుసుకుని తమ బాధలు చెప్పుకున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చడం సరికాదన్నారు చంద్రబాబు. అమరావతిలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ సీఎం. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారని కానీ ఇప్పుడు దొనకొండలో ఇన్ సైడ్ ట్రేడింగ్ మొదలయ్యిందని కమెంట్ చేశారు.