ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఆక్వా అక్వేరియా ఇండియా 2019 ను నిర్వహించతలపెట్టారు. శుక్రవారం ఆక్వా అక్వేరియా ప్రదర్శనను భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించనున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనను సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపిఇడిఎ) నిర్వహిస్తోంది. సముద్ర తీరం లేని రాష్ట్రాలలో సముద్రపు ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎంపిఇడిఎ చైర్మన్ కె.ఎస్. శ్రీనివాస్ పత్రికా సమావేశంలో తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన ఈ సావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంపిఇడిఎ హేచరీస్, శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు.
హైదరాబాద్ విమానాశ్రయంలో ఆక్వా క్వారంటైన్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ‘ఆర్టీమియా’ అనే చేపల ఆహారాన్ని, మన దేశం దిగుమతి చేసుకుంటోందనీ, దీనిని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్, అభివృద్ధి చేసిందని ఆయన తెలిపారు. మన దేశం ఆక్వాకల్చర్ ఎగుమతుల్లో రెండవ స్థానంలో ఉందన్నారు. మన దేశం నుంచి అమెరికా, ఐరోపా, చైనా, జపాన్ దేశాలకు సముద్ర ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. 2018-19లో ఏడు బిలియన్ డాలర్ల విలువ గల ఉత్పత్తులను మన దేశం ఎగుమతి చేసిందని వివరించారు.
తెలంగాణ మత్స్య శాఖ కమిషనర్ డా. సువర్ణ మాట్లాడుతూ.. దాదాపు వెయ్యి హెక్టార్లలో చేపల పెంపకాన్ని చేపడుతున్నామనీ, రిజర్వాయర్లలో, చెరువులలో చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఈ ప్రదర్శనకు వివిధ దేశాల నుంచి 5000 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. 200 స్టాళ్ళలో ఆక్వాకల్చర్ కు సంబంధించిన సాంకేతికత, ఇతర సంబంధిత అంశాలు ఉంటాయని చెప్పారు. చేపలు, రొయ్యలతో చేసిన వివిధ రకాల వంటకాలు కూడా ‘సీ ఫుడ్ ఫెస్టివల్’ పేరిట ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.
*