కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ఈ మధ్యే ప్రియాంకా గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. మరోవైపు 2022లో ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఎంపీ ఎలక్షన్స్లో భంగపడ్డ కాంగ్రెస్ రానున్న ఎలక్షన్లలో సత్తా చాటేందుకు కసరత్తులు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గానూ యూపీ అధ్యక్ష బాధ్యతలు ప్రియాంక గాంధీ వాద్రాకు ఇచ్చే అవకాశాలున్నాయని కాంగ్రెస్ విశ్వసనీయ సమాచారం.
సార్వత్రిక ఎలక్షన్లకు ముందు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసందే. ఆమె ప్రస్తుతానికి తూర్పు యూపీకి జనరల్ సెక్రటరీగా బాధ్యతలు వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన ప్రియాంకా గాంధీ వాద్రాకు ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్లోని కాంగ్రెస్ హెడ్క్వార్టర్స్లో ఓ గదిని కేటాయించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇదే కార్యాలయంలో ఉన్నారు. అంతకుముందు ఈ గది కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు జనార్దన్ ద్వివేదీ, సుశీల్కుమార్ షిండెల కార్యాలయంగా ఉండేది. ఈ కార్యాలయంలో ఇప్పటికే ప్రియాంక జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
కాగా, ప్రియాంకా గాంధీపై కాంగ్రెస్ నేతలు భౄరీ ఆశలు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ప్రియాంకా గాంధీనే బెటర్ అని పంజాబ్ సీఎం మరీందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ స్థానంలో ప్రియాంకానే సరిపోతారని ఆయన అన్నారు. కానీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ అంశంలో సీడబ్ల్యూసీదే తుది నిర్ణయమన్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ప్రియాంకాకు అప్పగిస్తే బాగుంటుందని ఇటీవలే మరో సీనియర్ నేత శశిథరూర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీకి పునర్ జీవం పోసేందుకు డైనమిక్ నేత అవసరమని, ప్రియాంకాకు దేశ సమస్యల్ని అర్థం చేసుకుని, స్పందించే తెలివి, తత్వం ఉందని, విజయం కోసం ఆమె ఎటువంటి సవాలునైనా స్వీకరిస్తారని అమరీందర్ అన్నారు.