2014 ఎన్నికలు.. అప్పుడు జనసేన పార్టీ పుట్టుకొచ్చింది. వచ్చిరావడంతోనే అంతా ఏపీలో ఒకటే హడావుడి.. ఎక్కడ చేసిన జనసేన..జనసేన.. సినిమాల్లో రౌడీలను వీర కుమ్ముడు కుమ్మే హీరో పవర్స్టార్ పవన్కళ్యాణ్ స్థాపించినదే జనసేన. ఎన్టీఆర్ లెవల్లో పవన్ కళ్యాణ్ వస్తున్నాడు.. ఎన్నికల్లో పోటీ చేసి అధికారం లోకి రావడం ఖాయమనుకున్నారు అభిమానులు... కానీ పార్టీ అధినేత తుస్సుమనే ప్రకటన చేశాడు.. జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయదు.. కాకుంటే టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇస్తుంది అన్నాడు.. స్టేట్మెంట్ ఇచ్చింది.. జనసేన అధినేతాయే.. అసలే సినిమాల్లో ఇరగదీసుడు హీరోనాయే.. అభిమానులు తోకతొక్కిన పాముల్లా బుసకొట్టారు.. టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది.. కానీ జనసేనకు ఒరింగిందేమి లేదు..
ఐదేండ్లు కాలం మంచులా కరిగిపోయింది.. 2019 రానే వచ్చింది... ఎన్నికలు ముంచుకొచ్చాయి.. జనసేనాని ఇక రంగంలోకి దూకుదాం అన్నాడు.. జనసైనికులు సిద్ధం కావాలన్నాడు.. అధికార పార్టీ తెలుగు ప్రజలను మోసం చేసిందన్నాడు.. బీజేపీ ఏపీ ప్రజలకు అన్యాయం చేసిందన్నాడు.. ప్రతిపక్ష పార్టీ ప్రజాసమస్యలపై పోరాటం చేయడంతో పారిపోయిందన్నాడు.. ఇక మిగిలింది నేనే... పోటీ చేద్దాం ఇరుగ దీద్దాం.. అంటూ ఏపీలో జనసేనాని పోరు బాట పట్టాడు.. ఎన్నికల పోరుబాటండి అని పిలుపునిచ్చాడు..
అంతా సినిమా మాయ.. మాయలో పడ్డవారు పడ్డారు.. ఇదేమీ బడాయి... సినిమా వాళ్ళ డైలాగ్లు మనకు తెలియనివా.. ఒకరు రాస్తారు.. మరొకరు నటిస్తారు.. గిట్లనే జనసేనాని కూడా పంచ్ డైలాగ్లు చెపుతున్నాడు అని అనుకున్నారు అసలు జనం.. జనసేనాని మాటలు నమ్మలేదు జనం.. అంతా సినిమా క్రిటిక్ అని నమ్మారు.. అందుకే జనసేనాని పోటీ చేసిన రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయాడు.. తన పార్టీ తరుపున పోటీ చేసిన వాళ్ళంతా డిపాజిట్లు రాకపోవడంతో పెట్టెబేడా సర్దుకున్నారు.. చచ్చిచెడినట్లుగా ఒకే ఒక్కడు మొనగాడు రాపాక వరప్రసాద్ జనసేనాని తరుపున గెలిచాడు..
కానీ ఇక్కడ ఏపీ ప్రజలు సినిమా హీరోను నమ్మలేదు.. మనతో కలిసి నడిచిన అసలు సేనాని, మనతో మమేకమై పోయిన జన సైనికుడు జగన్ ను నమ్మారు.. ఓట్లు గుద్దారు... భారీ మెజారిటీ ఇచ్చారు.. అధికారం వైసీపీ పరం అయింది... జగన్ సీఎం అయ్యాడు.. తాను 2014లో మద్దతిచ్చిన టీడీపీ ప్రతిపక్షం అయింది.. బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది.. కాంగ్రెస్ కనుమరుగైంది... జనసేనాని ఒకసీటుతో బోణి కొట్టింది.. అయితే ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ... ఎన్నికలు అయిపోయాయి.. జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీని నడిపే స్థితిలో లేకుండా పోయాడా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చ రావడానికి కారణం లేకపోలేదు..
జనసేన ఆధినేత పవన్ కళ్యాణ్ జనసేనను బీజేపీలో విలీనం చేసి బీజేపీకి కాబోయే సీఎం అభ్యర్థిగా ప్రచారం ముమ్మరంగా సాగుతుండటమే.. అంటే జనసేనను బీజేపీలో కలుపనని ఘంటాపథంగా పవన్ చెపుతున్నప్పటికి బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్న తీరు చూస్తుంటే జనసేన దుకాణం మూతపడటం ఖాయమనే ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు జనసేనలోని నేతలంతా వరుసగా వైసీపీలోకి బాటపట్టారు. ఇలాగే జనసేన నేత వ్యవహారం ఉంటే రాబోవు రోజుల్లో జనసేన దుకాణం ఉండదనే టాక్ వినిపిస్తుంది.