చెన్నమనేని విద్యాసాగర రావు బీజేపీ లో సీనియర్ నేత. రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కరలేని వ్యక్తి. ఎమ్మెల్యేగా ఎంపీగా గెలుపొందిన ఆయన, వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రి గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత అనూహ్యంగా ఆయనకు గవర్నర్ గా అవకాశం వచ్చింది. ఎవరు ఊహించని విధంగా కేంద్రం ఆయన్ను మహారాష్ట్ర గవర్నర్ గా నియమించింది. ఇప్పుడు గవర్నర్ గా ఆయన పదవీ కాలం ముగిసింది. ఆయన స్థానంలో కొత్త గవర్నర్ ను నియమించింది కేంద్రం. ఆయన గవర్నర్ గా రిలీవయ్యారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు వీడ్కోలు చెప్పింది. ఇక ఇప్పుడు విద్యాసాగర రావు భవిష్యత్తు ఏమిటనే చర్చ జరుగుతోంది. మళ్లీ రాజకీయ నేత గా తెలంగాణ లో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా అనే దానిపై డిస్కషన్ నడుస్తోంది. విద్యాసాగరావు వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు. బిజెపి లో డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వారికి క్రియాశీలక బాధ్యతలు అప్పగించ కూడదన్న నిబంధన పెట్టుకున్నారు. తాజాగా మీడియాతో చిట్ చాట్ చేసిన ఆ పార్టీ జాతీయ నేత మురళీధర్ రావు కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వారికి పార్టీలో పదవులు ఉండవని, అది పార్టీ అంతర్గత నిర్ణయమని వెల్లడించారు. దాంతో ఏదో ఒకరిద్దరికి తప్పని సరి పరిస్థితుల్లో మినహాయింపు ఇస్తే ఇవ్వచ్చేమో కానీ విద్యాసాగర రావ్ విషయంలో అలాంటి వెసులుబాటు ఉండకపోవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆ ఏజ్ లిమిట్ కారణంగానే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్ర మహాజన్ లకు మొన్నటి ఎన్నికల్లో పార్లమెంట్ టిక్కెట్టు ఇవ్వలేదు. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు మాత్రం స్థానిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మినహాయింపు ఇచ్చింది పార్టీ. ఆ క్రమంలో ఇప్పుడు విద్యాసాగర రావు తెలంగాణకు వచ్చాక ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఏదన్నా బాధ్యతలు కట్టబెట్టి పార్టీ ఆయన సేవలను వినియోగించు కుంటుందా లేకపోతే వయసు రీత్యా పక్కనపెట్టేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.