సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొరకు ఏమైంది..?
వైశ్య కోటా కింద కోలగట్ల వీరభద్ర స్వామి, ఎస్టీ కోటా నుంచి సీనియర్ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పేర్లు చాలా సీరియస్ గా వినిపించాయి.ఎవరికి పదవి దక్కినా దక్కకపోయినా నాలుగుసార్లు వరుసగా గెలిచిన ఎమ్మెల్యే గా నిజాయితీ,నిబద్ధత గల నాయకుడిగా ప్రభుత్వ ఉద్యోగం వదిలి వచ్చిన రాజన్నదొరకు గన్ షాట్లా పదవి దక్కుతుందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా సీన్ రివర్సైంది, ఆయన ప్లేస్ లో ఎస్టీ కోటాలో ఇదే జిల్లాకు చెందిన పాముల పుష్పశ్రీవాణికి మంత్రి పదవి లభించింది.
ఈయనకు కనీసం ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు. మంత్రి పదవి దక్కనప్పటినుంచి ఎమ్మెల్యే రాజన్నదొర తీవ్ర అసంతృప్తి, అసహనంలో ఉన్నారు.సీనియర్ నైనా కనీసం గౌరవం కూడా దక్కలేదని ఆయన అనుచరుల వద్ద వాపోయారు. రెండోసారి గెలిచిన పుష్పశ్రీవాణికి మంత్రి పదవి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన అధిష్ఠానం తనను ఎందుకు పక్కన పెట్టిందో అని ఆయన చాలా మదనపడ్డాడు. గత ప్రభుత్వంలో ఎన్నో ఒత్తిళ్లు వచ్చినప్పటికీ జగన్ నే నమ్ముకొని ఉన్నానని కానీ తనకు సరైన గౌరవం దక్కలేదని ఆయన వాపోతున్నారు.
ఈయన మనసులో వేదన ఇప్పుడు తీవ్రంగా మారింది. తనకు అధిష్టానం దగ్గర అంతగా పట్టులేదని సందుట్లో సడేమియాలా నియోజకవర్గంలో తన వ్యతిరేక వర్గం పనిగట్టుకొని పబ్లిసిటీ చేస్తోందని ఆయన వాపోతున్నారు.ఎమెల్యే కన్నా తమ పనులే ఎక్కువ అవుతాయని హల్ చల్ చేయడం తనను మరింత కలవరపాటుకు గురి చేస్తోందని, ఈ ఫ్రస్ట్రేషన్ని కార్యకర్తలపై చూపిస్తున్నారని, ఏ చిన్న పని అడిగినా అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
అసలు ఎవరైనా కార్యకర్తలు తన దగ్గరికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారని, తన విషయంలో ప్రొటోకాల్ పాటించడం లేదని కనీస గౌరవం కూడా ఉండటం లేదని అధికారులపై ఎమ్మెల్యే రాజన్నదొర బహిరంగంగానే విరుచుకుపడ్డారు. ఈయనని సముదాయించడం మంత్రుల కూడా ఒకింట ఇబ్బంది గానే మారింది.