కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత జరిమానాల మోత మోగిపోతున్నది. బండిని ఆపి చెక్ చేసి జరిమానా విధిస్తే.. దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. అయితే, ఈ భారీ జరిమానాలు విషయంలో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. బాబోయ్ అంతంత జరిమానాలు మావల్ల కాదు అని భయపడుతున్నారు.
దీనిపై ఎంతగా అవగాహన కల్గించినా ఊరట కలగడం లేదు. కేంద్రం కూడా ఇదే విషయంపై స్పష్టంగా చెప్తూనే ఉన్నది. అధిక జరిమానాలు అన్నది కేంద్రం ఖజానా నింపుకోవడానికి కాదు.. కేవలం ప్రజల రక్షణ కోసమే అని చెప్తున్నది. అయినా సరే మనం వినడం లేదు. సహనం నశించిపోయి వ్యవహరిస్తున్నారు. గొడవకు దిగుతున్నారు. లేనిదానికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. కొంత సహనంగా వ్యవహరిస్తే.. దాదాపు రూ. 22వేల రూపాయల ఫైన్ నుంచి తప్పించుకోవచ్చు.
ఈ విషయం చెప్తున్నది మాములు వ్యక్తులు కాదు. పోలీసులే చెప్తున్నారు. లైసెన్స్ లేకుండా బండి నడిపితే రూ. 5వేలు ఫైన్, ఆర్సి లేకుండా బయటకు వస్తే మరో రూ. 5వేలు, పొల్యూషన్, ఇన్సూరెన్స్ ఇలా మొత్తం కలుపుతుకుంటే రూ. 22 వేలరూపాయలు ఫైన్ ఉంటుంది. ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి 20 రోజుల గడువు ఉంటుంది.
ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి కట్టే బదులుగా, వాహనానికి సంబంధించి ఆ పత్రాలను 20 రోజుల్లోగా తెచ్చుకోవాలి. పొల్యూషన్ సెరిటిఫికేట్ వెంటనే ఇస్తారు. అందులో డౌట్ లేదు. అలానే ఇన్సూరెన్స్ సమయం దాటిపోతే ఇన్సూరెన్స్ కు రెండు వేలు ఖర్చు అవుతుంది. దాన్ని కట్టి తెచ్చుకుంటే సరిపోతుంది. దాంతో పాటు ఆర్సీ ఎలాగో ఉంటుంది. లైసెన్స్ కు అప్లై చేసి దానికి సంబంధించిన పత్రాలు తెచ్చుకున్నా దీని నుంచి బయటపడొచ్చు. కేవలం రూ. 100 రూపాయల ఫైన్ తో తప్పించుకోవచ్చు.