కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత జనాలు జరిమానాలు మోతకు భయపడిపోతున్నారు. వాహనాలు బయటకు తీసుకురావడం లేదు. ఢిల్లీ, హర్యానా వంటి రాష్ట్రాల్లో జరిమానాల బాదుడు ఎక్కువైంది. రూల్స్ ప్రకారం అన్ని ఉంటె వదిలేస్తున్నారు. లేదంటే మాత్రం చలానా విధిస్తున్నారు. చలానా విధించినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని, 20రోజుల్లోగా కట్టుకోవచ్చని.. సరైన పత్రాలు ఉంటె చలానా కట్టాల్సిన అవసరం లేదని ఇప్పటికే పోలీసులు కూడా స్పష్టం చేస్తున్నారు.
ఇదిలా ఉంటె, హర్యానాలోని చండీగఢ్ కు చెందిన సంజు అనే 21 సంవత్సరాల యువకుడు సెక్టార్ 39లో ఉన్న ఓ భీమా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే సంజు ట్రాఫిక్ నిబంధనలు విరుద్ధంగా యు టర్న్ తీసుకోవడంతో ఆయనకు పోలీసులు జరిమానా విధించారు. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదు. కొత్త చట్టం అమల్లోకి రాకముందే అంటే జులై 26 వ తేదీన జరిగింది. కొత్త వాహన చట్టం సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.
కానీ, సంజు దాన్ని లైట్ గా తీసుకున్నాడు. యు టర్న్ తీసుకున్నందుకు ఆయనకు రూ. 300 ఫైన్ వచ్చింది. పెద్దగా పట్టించుకోకపోవడంతో.. ఈ వ్యవహారం చండీగఢ్ కోర్టుకు చేరుకుంది. చలానా వ్యవహారం కోర్టుకు చేరుకోవడంతో ... పోలీసులు సంజును కోర్టుకు తీసుకెళ్లారు. అతని చలానా రికార్డును బయటకు తీస్తే కోర్టు కూడా షాక్ అయ్యింది. పోలీసులు కూడా ఈ విషయంపై షాక్ తిన్నారు. ఈ స్థాయిలో చలానాలు ఉన్నాయా అని షాక్ అయ్యారు పోలీసులు.
2017 నుంచి 2019 వరకు రెండేళ్లలో ఆయనకు 189 చలానాలు విధించారట. కానీ, ఆ విషయం తనకు తెలియదని, అన్ని చలానాలు తన పేరుతో ఉన్నాయంటే నమ్మలేకపోతున్నానని అంటున్నాడు సంజు. మరి సంజు పేరుమీదున్న అన్ని చలానాలు కలిపితే ఎంత కట్టాల్సి వస్తుందో అని సంజు భయపడిపోతున్నాడు. పాత చలానాలను కొత్త చట్టం ప్రకారం కట్టాలి అంటే.. ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అయితే, రెండు సంవత్సరాలపాటు చలానాలు కట్టకుండా ఉంటె పోలీసులు ఏం చేస్తున్నారని పోలీసులను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది.