ఈఎస్ఐ కుంభకోణం కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఏసీబీ అధికారుల దాడుల్లో విస్తుగొలిపే నిజాలు బైటపడుతున్నాయి. కమిషన్తో మొదలైన స్కామ్ కాస్తా...నకిలీ బిల్లుల వరకు చేరిందని ఏసీబీ దర్యాప్తులో బట్టబయలైంది. మొదట కింది స్థాయిలో మొదలైన ఈ బాగోతం కాస్తా... డైరెక్టర్ వరకూ పాకిందని విచారణలో వెల్లడైంది.
ఈఎస్ఐ మందుల కొనుగోలు కుంభకోణంలో లోతుగా దర్యాప్తు జరుపుతోంది ఏసీబీ. నాలుగేళ్లలో వెయ్యి కోట్ల మందుల కొనుగోళ్లు జరిగినట్టు ధ్రువీకరించింది. ఏడాదికి సుమారుగా 250 కోట్ల రూపాయలు విలువ చేసే మందులు కొనుగోలు చేశారు అధికారులు. నకిలీ బిల్లుల మాయాజాలంతో రెచ్చిపోయారని గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 డిస్పెన్సరీల్లో మెరుపు దాడులు నిర్వహిస్తున్న ఏసీబీ అదికారులు...నాలుగేళ్ల రికార్డులను పరిశీలిస్తున్నారు. డిస్పెన్సరీలు ఇచ్చిన ఆర్డర్లు, వాటికి చేరిన స్టాక్స్ తో పాటు చెల్లింపులకు సంబందించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. డైరెక్టర్ దేవికారాణి కార్యాలయం నుంచి స్వాదీనం చేసుకున్న రికార్డుల ఆధారంగా...డిస్పెన్సరీలతో పాటు పలు మెడికల్ ఏజన్సీల కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.
అసలు ఈ మందుల కొనుగోలు కుంభకోణం ఎక్కడ స్టార్ట్ అయింది? అని ఆరా తీసిన...అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మొదట రికార్డు రూముల్లో రికార్డులు రాసే సిబ్బంది... కంప్యూటర్ ఆపరేటర్లు , సెక్షన్లలోని కిందిస్థాయి సిబ్బంది...మందులు సరఫరా చేసే ఏజన్సీల నుంచి 10 శాతం కమిషన్ను తీసుకునే వారు. ఈ విషయం కాస్తా...జాయింట్ డైరెక్టర్గా ఉన్న పద్మకు తెలిసింది. దీంతో...ఆ పర్సంటేజీ ఆమె కనుసన్నల్లో 50 శాతానికి చేరింది . పద్మతో పాటు అధికారులకు 50 శాతం కమీషన్ ఇవ్వాల్సివస్తుండటంతో...మందులు సరఫరా చేసే ఏజన్సీలు సైతం మెల్లమెల్లగా దారితప్పడం స్టార్ట్ చేశాయి. ఈ పర్సంటేజీలతో అధికారులు కరెన్సీని వెనుకేస్తున్నారని డైరెక్టర్గా ఉన్న దేవికారాణికి తెలిసింది. దీంతో...ఆమె ఈ మొత్తం వ్యవహారంపై ఆరా తీసింది. అందరినీ తన కార్యాలయానికి పిలిపించి పర్సంటేజీల గురించి తెలుసుకుంది.
బిల్లులు శాంక్షన్ చేసే అధికారం తనకే ఉండటంతో...కోటరీగా ఉన్న కొంతమంది అధికారులకు...మీరేమి చేసినా బిల్స్ శాంక్షన్ చేస్తానంటూ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో...అప్పటి నుంచి పర్సంటేజీల వ్యవహారం కాస్తా...డూప్లికేట్ బిల్లులు, ఇండెంట్స్ వరకు వెళ్లింది. మందులు సప్లై చేయకుండానే బిల్లులు వస్తుండటంతో మెడికల్ ఏజన్సీలు...జస్ట్ డూప్లికేట్ బిల్స్ రికార్డుల్లో పెడుతుండటంతో కోట్ల రూపాయలు చేతిలోకి వచ్చాయి. ఈఎస్ఐకి మందులు సరఫరా చేసే అధికారిక కంపెనీలను బురిడీ కొట్టించడంలోనూ డైరెక్టర్ నుంచి కిందిస్థాయి వరకూ దిట్ట అని...ఉద్యోగులే చెప్పటంతో ఏసీబీ ఆఫీసర్స్ విస్తుపోయారు. సడన్గా శుక్రవారం సాయంత్రం ఇండెంట్లను ప్రిపేర్ చేసి...సోమవారం ఉదయం కల్లా సప్లై చేయాలంటూ రేట్ కాంట్రాక్ట్ సంస్థలకు ఆర్డర్ పెట్టేవారు. ఆ సంస్థలు సోమవారం ఉదయానికి సప్లై చేయడంలో విఫలమౌతారని తెలిసే ఈ ఇండెంట్ను ప్రిపేర్ చేసేవారు. అనుకున్నట్టుగానే వారు మందులు సప్లై చేయకపోవడంతో..సోమవారం మధ్యాహ్నానికి తమకు నచ్చిన తమ స్కామ్కు సహకరించే ఏజన్సీలకు ఇండెంట్ను పంపేవారు. అప్పటికే ఆ ఇండెంట్ కోసం వెయిట్ చేస్తున్న ఏజన్సీలు..గంటల వ్యవదిలోనే మెడిసిన్స్ను సప్లై చేసేవారు.. ఐతే...ఇందులో మందులు వచ్చాయి కదా అనుకుంటే పొరపాటే...రేట్ కాంట్రాక్ట్ సంస్థ 4 రూపాయలకు సప్లై చేసే టాబ్లెట్ను ఈ ప్రైవేట్ ఏజన్సీలు 250 రూపాయలకు సరఫరా చేసేవారని రికార్డుల్లో బయపడింది. ఇక...ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసిన ఏసీబీ...అనుమానితులను కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. ఈ కుంభకోణం ఇంతటితో ఆగుతుందా లేక వందల కోట్లకు దాటిపోతుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తోంది ఏసీబీ.