ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా.. పాక్ దేశాల మధ్య పచ్చగడ్డి వేయక ముందే భగ్గు మంటోంది. రెండు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. చర్చలకు దిగే ప్రసక్తి లేదని.. ఒకవేళ చర్చలు జరగాలి అంటే.. అది పీవోకే విషయంలో మాత్రమే జరుగుతుందని ఇప్పటికే ఇండియా స్పష్టం చేసింది. అటు ఐరాసలోను పాక్ ఇండియాపై భగ్గుమంది. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఏదో జరిగిపోతున్నట్టు వ్యాఖ్యానించింది.
ఇండియా అభివృద్ధి గురించి మాట్లాడితే... పాక్ మాత్రం ఇండియాపై యుద్ధం గురించి మాట్లాడింది. అయితే దౌత్యపరమైన సంబంధాలు నడపడంలో పాక్ కంటే ఇండియా వందల రేట్లు ముందు ఉన్నది. ప్రతి విషయంలో సక్సెస్ అవుతూ వస్తున్నది. ఐరాస మానవహక్కుల సంఘంలో పాక్ ఇండియాపై ఫిర్యాదుకు సంబంధించిన పిటిషన్ ను దాఖలు చేయాలని చూసింది. తమకు 58 దేశాల మద్దతు ఉందని పాక్ విదేశాంగ శాఖ మంత్రి చెప్పడంతో.. నవ్వులపాలైంది. ఐరాస మానవహక్కుల సంఘంలో కేవలం 47 దేశాలు మాత్రమే సభ్యదేశాలుగా ఉన్నాయి. 58 ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నిస్తున్నారు.
ఇదే ప్రశ్నను పాక్ జాతీయ మీడియా ఖురేషిని అడిగింది. దీంతో అయన ఆ మీడియాపై కస్సుమన్నారు. మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది అని దురుసుగా మాట్లాడాడు. ఐరాస మానవహక్కల సంఘంలో మద్దతు ఉన్నప్పుడు పిటిషన్ దాఖలు కాకుండా ఎందుకు తిరస్కరించారని అడిగిన ప్రశ్నకు సైతం అయన బదులివ్వలేదు.
ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే ఈ విషయంలో ఓడిపోయినట్టు ఒప్పుకున్నాడు. దౌత్యపరమైన సంబంధాలు నెరపడంలో పాక్ వెనుకబడిపోయిందని, ఇండియా మార్కెట్ దృష్ట్యా ఆ దేశానికి అందరు సపోర్ట్ చేస్తున్నారని ఇమ్రాన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఇండియా బలమైన దేశం, ఆర్ధికంగా బలంగా ఉందని ఇమ్రాన్ చెప్తుంటే.. ఇండియాను పేద దేశంగా ఖురేషి వర్ణించడం విశేషం.