అమ్మ - అపరాజిత దేవిగా వరాలిచ్చే పర్వదినం మహర్నవమి నేడే!

మహిషాసురుణ్ని మర్దించి, లోకాలన్నింటికి ఆనందాన్ని చేకూర్చింది అమ్మ.  అవతారాన్నింటి లో దుష్టశిక్షణ చేసిన ఈ రూపం అనంత అత్యుగ్రం. అందరు దేవతలు చేసిన చిద్యాగ కుండం నుంచి వెలుగు ముద్దగా ఆవిర్భవించి, సకల దేవతల అంశలను సమీకరించి, వారిచ్చిన ఆయుధాలను, అలంకారాలను ధరించి స్త్రీలను చులకనగా చూసి దున్నపోతు మనస్తత్వం మూర్తీభవించిన మహిషాసురుణ్ని సంహరించింది.


సింహవాహనారూఢై, ఉగ్రరూపంతో, అష్టభుజాలతో పాశం, అంకుశం, త్రిశూలం మొదలైన ఆయుధాలను ధరించి దర్శనమిచ్చే మహాశక్తిని పూజిస్తే శత్రుభయం ఉండదు. అన్ని అవతారాలలోనూ ఆది పరాశక్తి దుష్ట రాక్షసులని సంహరించింది ఆశ్వయుజ శుద్ధ నవమి నాడే. అందుకే దీనికి ప్రత్యేకత. సంవత్సరంలో ఉండే 24 నవమి తిథుల్లోనూ గొప్పది కనుక మహర్నవమి అని పిలవబడుతుంది.


ఈనాటి మరొక విశేషం ఆయుధ పూజ.ఆశ్వయుజ నవమి వరకూ దేవీ నవరాత్రిఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రులలో చివరిరోజు - అంటే ఆశ్వయుజ శుక్లపక్ష నవమిని - మహర్నవమి - అంటారు. దుర్గాష్టమి, విజయదశమి లాగే 'మహర్నవమి' కూడా అమ్మవారికి విశేషమైన రోజు. మహర్నవమి నాడు అమ్మవారిని 'అపరాజిత' గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు. అమ్మ దుర్గాదేవి అనేకావతారాల్లో అపరాజితాదేవి దుర్మార్గులను ఓడించి సన్మార్గులకు సుఖజీవనాన్ని అందించే అవతారం అపరాజిత - అంటే ఏవరి చేతా ఓడించబడనిది అని అర్ధం.


కొందరు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజయిన ఈ మహర్నవమి పర్వదినాన ముక్తేశ్వరీ దేవిని అర్చిస్తారు. దశ మహావిద్య పూజ, సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు. నవదుర్గ శాక్తేయ సాంప్రదాయులు సిద్ధిధాత్రీ పూజ చేస్తారు. మహార్నవమి రోజున ఇతర పిండి వంటలతో బాటు చెరుకుగడలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, బీహార్ మొదలైన ప్రదేశాల్లో మహర్నవమి రోజున 'కన్యాపూజ' నిర్వహిస్తారు. నవరాత్రులను పురస్కరించుకుని తొమ్మిది మంది కన్యారూపాలు సంకేత పూర్వకంగా ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ శక్తిస్వరూపాలను ఆరాధిస్తారు. అమ్మవారికి అభిషేకంచేసి, ముఖాన కుంకుమదిద్ది, కొత్తబట్టలు సమర్పిస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మహర్నవమినాడు సువాసిని పూజ, దంపతి పూజ జరుపుకుంటారు.


తెలంగాణా ప్రాంతాల్లో మహర్నవమి నాడు బతుకమ్మ పూజ చేసి సరస్వతీ ఉద్యాపన చేస్తారు. ఇతర రాష్ట్రాల్లో దుర్గాష్టమి రోజున ఆయుధపూజ చేయగా కేరళ రాష్ట్రంలో మాత్రం మహర్నవమి నాడు ఆయుధపూజ చేసే సంప్రదాయం కొనసాగుతోంది. నవరాత్రులు ముఖ్యంగా మహర్నవమి సందర్భంగా మైసూరు మహారాజా ప్యాలెస్ ను మహాద్భుతంగా అలంకరిస్తారు.


అమ్మవారి దేవాలయాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ మహర్నవమి రోజున దేవీ ఆలయాలు భక్తుల రద్దీతో కిక్కిరిసి ఉంటాయి. విజయవాడ, కోల్కతా, ఉజ్జయిని తదితర ప్రాంతాల్లో ఉన్న కనకదుర్గ ఆలయాలకు దేశం నలుమూలల నుండీ లక్షలాదిమంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: