హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్టాపిక్గా మారిన అంశం. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రాజీనామాతో ఈ స్థానానికి ఉపఎన్నిక ఏర్పడింది. అయితే ఇక్కడ గెలుపు ఎవరిని వరిస్తోందనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. గతంలో ఉండి మధ్యలో రద్దయ్యి నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండానే ఎగురుతోంది. అక్కడ గెలుపు అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇది అందని ద్రాక్షగా మిగిలింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి హుజూర్నగర్ను దక్కించుకోవాలన్న నిశ్చయంతో పక్కా ప్లాన్లు వేసింది టీఆర్ఎస్.
నామినేషన్ల పర్వం ముగియడంతో పోటీ ద్విముఖంగా ఉంటుందని అనుకున్నా ముందస్తు అంచనాలను బట్టి చూస్తే హుజూర్నగర్ సీటు ఈ సారి టీఆర్ఎస్ కోటాలో చేరినట్లే అనిపిస్తోంది. అవసరం ఉన్నప్పుడు ఓ అడుగు దిగాలన్నది రాజకీయ చతురత. కేసీఆర్ రాజకీయ చతురత వాడడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఇప్పటి వరకు ఒంటరిగా పోటీ దిగిన టీఆర్ఎస్ అనూహ్యంగా సీపీఐతో పొత్తు పెట్టుకుంది. ఇదే టీఆర్ఎస్ గెలుపుకు నాంది పలకనుంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టులకు ఉన్న ఓటు బ్యాంకు ఇక్కడ టీఆర్ఎస్కు ప్లస్ కానుంది. గత ఎన్నికల్లో ఇక్కడ సీపీఐ సపోర్ట్ కాంగ్రెస్కు ఎంతో హెల్ఫ్ అయ్యింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కేవలం 7 వేల ఓట్లతో గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు సీపీఐ, టీజేఎస్, టీడీపీ మద్దతునిచ్చాయి. అయితే ఈ సారి కాంగ్రెస్కు అప్పటి మిత్రపక్షాలు ఇప్పుడు దూరమయ్యాయి. ఆంధ్రా బోర్డర్ నియోజకవర్గం కావడంతో పాటు కమ్మ వర్గం ఓటర్లు 12 వేల వరకు ఉన్నారు. దీంతో ఇక్కడ టీడీపీ పోటీ కాంగ్రెస్కు మైనస్. ఇక టీజేఎస్ మద్దతు తెల్పినా.. ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే.
ఇక ఈ నియోజకవర్గం ఆంధ్రా బోర్డర్ కావడంతో ఇక్కడ రెడ్డి వర్గం ఓట్లతో పాటు వైసీపీ అభిమానులు కూడా ఉన్నారు. ఇప్పుడు వైసీపీ కూడా టీఆర్ఎస్కే మద్దతు తెల్పడంతో ఈ ఓట్లు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకే పడే అవకాశం ఉంది. ఈ సమీకరణాల దృష్ట్యా హుజూర్నగర్ సీటు కూడా అధికార పార్టీలో చేరేలా ఉంది. అదే టైంలో అటు విపక్ష కాంగ్రెస్లో అన్ని వర్గాలు ఏకతాటిమీదకు రావడం కష్టంగా కనిపిస్తోంది. ఇటు టీఆర్ఎస్ గెలుపు కోసం ఏకంగా 70 మంది వరకు పని చేస్తున్నారు.