ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా ప్రవేశ పెట్టిన పథకాల్లో ‘ వైఎస్సార్ వాహనమిత్ర ’ ఒకటి. ఈ పథకం ద్వారా ఏపీలోని ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రతి ఏడాది రూ. పది వేలు సాయం చేయనున్నారు. ఇక ఏడాదికి సంబంధించి అక్టోబర్ 4న సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించి ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఈ పథకాన్ని లబ్ది దారులకు అందించారు.
దీంతో ప్రతి లబ్దిదారుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఊహించని ప్రశంస ఒకటి ఎదురైంది. పాలకోడేరు మండలం గరగపర్రుకు చెందిన టీడీపీ కార్యకర్తలు జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఫ్లెక్సీ కట్టారు. ఈ ఫ్లెక్సీలో వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఏటా రూ. 10 వేలు అందిస్తున్న సీఎం జగన్కు టీడీపే కార్యకర్తలు పూడి రామకృష్ణ, మేడిశెట్టి శ్రీనివాస్, కట్టా పవన్కల్యాణ్ లు శుభాకాంక్షలు చెప్పారు.
అసలు టీడీపీ అభిమానులు జగన్ ఫ్లెక్సీ కట్టడమే విచిత్రమనుకుంటే...ఆ ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో, ఉండి టీడీపీ ఎమ్మెల్యే రామరాజు ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఫ్లెక్సీ గురించి తనకు ఏమి తెలియదని ఎమ్మెల్యే రామరాజు వివరణ ఇచ్చారు. ఇక ఫ్లెక్సీని బట్టి చూస్తే సీఎం జగన్ పార్టీలకి అతీతంగా పథకాలు ప్రజలకు అందిస్తున్నారని అర్ధమవుతుంది. మొత్తానికి టీడీపీ కార్యకర్తలు జగన్ ని శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీ కట్టడం గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం వీచినా ఉండిలో మాత్రం టీడీపీ వరుసగా మూడోసారి విజయం సాధించింది. ఇక్కడ నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి సీవీఎల్.నరసింహారాజు ఓడిపోగా మంతెన రామరాజు తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు.