ఖాతా టీడీపీది.. వాడుకొనేది టీఆర్ఎస్!
మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలా మంది ఫిరాయింపులకు పాల్పడ్డారు. తెలంగాణలో అధికారం సాధించుకొన్న తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. చట్ట ప్రకారం ఇలాంటి ఫిరాయింపు దారులకు అనర్హత వేటు పడాలి. అందులోనూ ఇలా ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యే ఒకరికి కేసీఆర్ మంత్రిపదవిని కూడా ఇచ్చారు.
ఈ విషయంలో ఆయా పార్టీలు గొడవ చేస్తున్నాయి. చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరాయి. దీనిపై కోర్టుకు కూడా వెళ్లాయి. అయితే.. స్పీకర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు.తాము తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాం మొర్రో అని చెప్పుకొని.. ఎంచక్కా ఆ ప్రభుత్వంలో మంత్రి పదవులను అనుభవిస్తున్న వారిని కూడా ఇంకా వారు గెలిచిన పార్టీల్లో ని సభ్యులుగా చూపుతున్నారు.
తలసాని పేరు ఇంకా తెలుగుదేశం ఎమ్మెల్యేల జాబితాలో ఉంది. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామాను కూడా సమర్పించాడు. అయితే ఇప్పటి వరకూ దాన్ని ఆమోదించడం కానీ.. తెరాసలో చేరి మంత్రిపదవిని స్వీకరించిన ఆయనపై చర్యలు తీసుకోవడం కానీ జరగలేదు. మర ఇలా ఎన్ని రోజులు బండిలాగిస్తారో!