భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసిన క్షిపణి పితామహుడు.. గగనతలంలో భారత కీర్తిపతాకను రెపరెపలాడించిన శాస్త్రవేత్త... జాతి జనుల మనసులో చెరగని ముద్ర వేసిన ప్రజల రాష్ట్రపతి.. దివంగత అబ్దుల్ కలాంకు జాతి ఘననివాళి అర్పించింది. దేశాన్ని శోకసముద్రంలో ముంచి నింగికేగిన అసామాన్యుడికి అశ్రునివాళులర్పించేందుకు ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ తరలివచ్చారు.
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం భౌతిక కాయం నేడు ఆయన సొంతూరు రామేశ్వరానికి తరలిస్తున్నారు.ఢిల్లీలోని 10 రాజాజీమార్గ్లోని అధికారిక నివాసం నుంచి పాలం ఎయిర్పోర్టుకు కలాం పార్థివదేహాన్ని తరలించారు. అక్కడ గౌరవ వందనం చేసిన అనంతరం ఎయిర్ఫోర్స్కు చెందిన ప్రత్యేక విమానంలో మధురైకి తరలించారు. తమిళనాడులోని మధురై నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కలాం పార్ధివదేహాన్ని రామేశ్వరానికి తరలించనున్నారు.
అబ్దుల్ కలాం శ్రద్దాంజలి ఘటిస్తున్న దృశ్యం
కలాం పార్థివదేహాన్ని ఈ రోజు రాత్రి ఏడు గంటల వరకు ప్రజల సందర్శనార్ధం అనుమతిస్తారు. వెంట కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, మనోహర్ పారికర్లు ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నారు. మధురైలో తమిళనాడు గవర్నర్ రోశయ్య తదితరులు నివాళులు అర్పించనున్నారు. కలాంకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పించారు. గురువారం ఉదయం 11గంటలకు రామేశ్వరంలోని ఆయన స్వస్థలంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక రేపు జరగనున్న కలాం అంత్యక్రియలకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరవుతారు.