ఒక వ్యవస్థకు నాయకత్వం వహించాలంటే ఎంతో శ్రమ, దీక్ష, దానికి అనుగుణంగా క్రమశిక్షణ కలిగి ఉంటేగాని అది సాధ్యం కాదు. ప్రస్తుత రాజకీ నాయకులు చిన్న చిన్న సమావేశాలు నిర్వహించాలంటేనే లక్షలాగి రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అలాంటిది ఓ కులం అంతటినీ ఏకం చేసి లక్షలాది మందిని ఒక చోటకు చేర్చి, భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాలంటే కోట్లు ఖర్చవుతుంది. రెండు రోజుల క్రితం అహ్మదాబాద్ లో జరిగిన పటేల్ కులస్థుల బహిరంగ సభ, ఇందులో దాదాపు 5లక్షల మంది ఒక చోట చేర్చడమంటే మాటలు కాదు. ఎంతో ముందస్తు ప్రణాళిక ఉంటేనే ఇది సాధ్యం కాదు. ఇది కేవలం ఒక యువకుడే చేశాడంటే నమ్మశక్యం గా లేకపోయినా ఇది నిజం. అయితే ఇది కేవలం అయన ఒకడి వల్లే సాద్యం కాలేక పోవచ్చని అధికార ప్రభుత్వం భావిస్తోంది.
హార్దిక్ పటేల్ నేతృత్వంలో సాగుతున్న ఉద్యమం హింసకు
హార్దిక్ పటేల్ కుటుంబం రాజకీయ నేపథ్యం కాదు. పెద్దగా సంపణుల కుటుంబం కాదు. గతంలో ఏ రాజకీయ పార్టీలలో క్రియాశీలంగా వ్యవహరించింది లేదు. ఉద్యమంలోకి ఓ విప్లవంలా దూసుకువచ్చిన యువనేత హార్దిక్ పటేల్. హార్ధిక్ నేతృత్వంలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ పటేల్ వర్గం చేస్తున్న ఆందోళన కారణంగా చెలరేగిన అల్లర్లు ఇప్పుడిప్పుడే చల్లారుతున్నాయి. దళాలు మొహరించి పరిస్థితి అదుపులోకి తెస్తున్నారు. అయితే ఈ అల్లర్ల వెనక కుట్ర కోణం ఉందా అని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. 2002 గుజరాత్ అల్లర్ల తరువాత ఇంతటి స్థాయిలో అల్లరులు గుజరాత్ లో జరగలేదు. కానీ ఓ 22 ఏళ్ల కుర్రాడు హార్దిక్ పటేల్ నేతృత్వంలో సాగుతున్న ఉద్యమం హింసకు దారి తీయడంపై నిఘా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
అయితే.. హార్దిక్ పటేల్ వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా.. విమర్శలు వెల్లువెత్తుతున్నా, ఇప్పుడు గుజరాత్ పటేల్ కులస్థులకు, ముఖ్యంగా యువతకు ఆయన చెప్పిందే వేదం. పటేల్ సంచలన నిర్ణయాలతో సాక్షాత్తు ప్రదాని నరేంద్రమోడీకి సైతం ఉలిక్కి పడుతున్నారు. అసలు హార్ధిక్ పటేల్ ఎవరు? ఆయన వెనుక ఉన్న శక్తి ఎవరు? దేశ రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించిన పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి బహిరంగ సభ అనంతరం గుజరాత్ లో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. గొడవలు జరిగి, ఎనిమిది మంది చనిపోయి, కర్ఫ్యూ ,ఆపై సైన్యం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. హార్దిక్ పటేల్ వ్యవహారంతో అదే కులానికి చెందిన గుజరాత్ సీఎం ఆనందీ బెన్ పటేల్ రాజకీయ భవిష్యత్తు సైతం ఇబ్బందుల్లో పడింది.
వాస్తావానికి సామాజికంగా, ఆర్ధికంగా పటేల్ కులస్ధులు ఎంతో అభివృద్ధి చెంది ఉన్నారు. గుజరాత్ లోని పటేల్ సామాజిక వర్గంలో లెవా, కడవ అనే రెండు వర్గాలు ఉన్నప్పటికీ వారెప్పుడూ ఐక్యంగానే ఉన్నారు. వ్యవసాయ రంగంలోనైనా, వ్యాపార రంగంలోనైనా పటేళ్లు సొంత కాళ్లపైనే నిలబడతారు. గుజరాత్ మొత్తం 12 శాతంగా ఉన్న పటేళ్లు ఏ మాత్రం ఆర్ధికంగా వెనుకబడిలేరు. ఓబీసీ లో ఉన్న కులాలతో పోలిస్తే, ఆర్ధికంగా, రాజకీయంగా బాగా ఎదిగిన వాళ్లే. సర్దార్ వల్లభాయ్ పటేల్, మొదలుకుని గుజరాత్ సీఎం బాబూభాయ్ పటేల్, చిమన్ భాయ్ పటేల్, కేశూ భాయ్ పటేల్ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ వరకు అందరూ ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. ఇలా రాజకీయంగా సింహాభాగం వాటా అనుభవిస్తున్నారు. వ్యాపారాల్లో నిష్ణాతులైన పటేళ్లు కోట్లకు పడగలెత్తి ఉన్నారు. గుజరాత్ కొన్ని కాలనీల్లో ముస్లీం లకు , నిరుపేదలైన ఇతర కులాలకు ఈ వర్గం వారు ఇళ్లు అద్దెకు కూడా ఇవ్వరు.
హార్దిక్ పటేల్ గతంలో వీహెచ్ పీ ఆధినేత ప్రవీష్ తొగాడియా సన్నిహితంగా
ప్రస్తుతానికి పటేల్ వెనుక ఉన్న శక్తి ఎవరన్న విషయం జవాబు లేని ప్రశ్నగా ఉన్నా, వారు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పటేల్ వ్యతిరేక శక్తులేనని సీఎం అనందీ బెన్ పటేల్ వ్యాఖ్యానించినట్టుగా ఓ ఆడియో టేప్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. హార్దిక్ పటేల్ గతంలో వీహెచ్ పీ ఆధినేత ప్రవీష్ తొగాడియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయట పడ్డాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , నితీష్ కుమార్ ఇప్పటికే తమ ప్రసంగాల్లో హార్దిక్ పేరును ప్రస్తావించి ప్రశంసలతో ముంచెత్తాయి. పటేల్ కులస్థుల పోరుకు మద్దతు ఇస్తున్నట్టూ ప్రకటించారు. వీరిలో ఎవరైనా హార్దిక్ పోరు వెనుక ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, సబ్ మెర్సిబుల్ పంపుల వ్యాపారం చేస్తూ ఉద్యమంలోకి వచ్చిన హార్దిక్, తనంతట తానుగా ఇంత పెద్ద ర్యాలీ సభను ఏర్పాటు చేసుకునే శక్తిని, కోట్ల రూపాయలను కలిగి ఉంటారని మాత్రం అనుకోలేం.
ఈ నేపథ్యంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్ర జరుగుతోందా అనే కోణంలో నిఘా సంస్థలు దృష్టి పెట్టాయి. ఉద్యమంలో ఆందోళన చేస్తున్నహార్దిక్ పటేల్ ను అరెస్ట్ చేస్తే వంద బస్సులు దగ్దం కావడం, రేగిన అల్లర్లలో 8 మంది మరణించడం అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో ఆ రాష్ట్ర హోం మంత్రి ఇంటిపై కూడా దాడి చేసేందుకు అల్లరి మూకలు ప్రయత్నాలు చేసాయి. శాంతి యుతంగా జరగాల్సిన ఉద్యమంలో అకస్మాత్తుగా హింస చలరేగడం అది తీవ్ర రూపం దాల్చడం పై అనుమానిస్తున్నారు. కాగా శాంతిని ప్రభోదించిన మహాత్ముడు పుట్టిన గడ్డపై హింసకు పాల్పడడం సరైంది కాదని ప్రధాని నరేంద్రమోడీ ఉద్యమకారులను కోరారు. ప్రస్తుతానికి చల్లారినా మళ్లీ ఈ ఆందోళన విజృంభించేందుకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది కడుపు నిండిన వాడు చేస్తున్న పోరాటం.