హెరాల్డ్ సెటైర్ : బీజేపి+జనసేన పరిస్దితి మరీ ఇంత ఘోరంగా ఉందా ?

Vijaya
వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే..రాబోయే ఎన్నికల్లో  బీజేపీ+జనసేన కూటమే అధికారంలోకి వచ్యేది.. ఇది కొద్ది కాలం క్రితం కమలంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన. అయితే వీర్రాజు ప్రకటనకు తాజాగా వీడీపీ సంస్ధ చేసిన సర్వేకి పూర్తి తేడా కనబడుతోంది. నిజానికి వీర్రాజు ఏదో ఆవేశంలో చెప్పేశాడు కానీ బీజేపీ వాస్తవ బలం ఏమిటో ఆయనకు తెలీకుండానే ఉంటుందా ? ఇక మిత్రపక్షం జనసేన బలంపై వీర్రాజుకు ఓ అంచనా లేకుండానే ఉంటుందా ?  అయినా అధికారంలోకి రాబోయేది తామే అని ప్రకటిచాడంటే ఏదో శ్రేణులను ఉత్సాహ పరచాలని తప్ప ఇంకేమీ ఉండదని తెలిసిపోతోంది.   ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏడాదిన్నర పాలనపై వీడీపీ సంస్ధ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసింది. ఈ సర్వేలో రెండే ప్రశ్నలడిగింది.




మొదటిదేమో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రిగా ఎవరుండాలని కోరుకుంటున్నారు. ఇక రెండో ప్రశ్న ఏ పార్టీకి ఓట్లేస్తారు ? అని. రెండు ప్రశ్నలకు జనాలు మొదటిఛాయిస్ గా జగన్+వైసీపీకి ఓట్లేస్తే రెండో చాయిస్ గా చంద్రబాబు+టీడీపీని ఎంచుకున్నారు. మరి అధికారంలోకి  వచ్చేస్తామని కలలుకంటున్న బీజేపి, జనసేన పరిస్ధితి ఏమిటి ? వారి తరపున సర్వే చేసిన ఇద్దరు నేతల గురించి జనాలు ఏమనుకుంటున్నారు ? పార్టీల విషయంలో  13 జిల్లాల్లో జరిగిన సర్వేలో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలో తప్ప ఇంకే జిల్లాలో కూడా బీజేపీకి 4 శాతం మద్దతు కనబడలేదు. ఇక మిత్రపక్షం జనసేనకు మద్దతుగా ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే 7 శాతం, వైజాగ్ జిల్లాలో 6.90 శాతం మద్దతుగా నిలిచారు.  మిగిలిన 10 జిల్లాల్లో సుమారు 4 శాతం మద్దతు మాత్రమే చెప్పారు.  ఇక కాంగ్రెస్, వామపక్షాల గురించి జనాలు అసలు ఆలోచిస్తున్నట్లు కూడా లేదు.




ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా 3.90 శాతం మద్దతు పలికారు. బీజేపీ నేతలైన దగ్గుబాటి పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణకు 1 శాతం జనాలు మద్దతుగా నిలవటమే విచిత్రం. ఎందుకంటే కన్నా అవుట్ డేటెడ్ నేతన్న విషయం అయినా 1 శాతం మద్దతు పలకటం విశేషమే. ఇక పురందేశ్వరికి కూడా 1.10 శాతం మంది జనాలు సిఎంగా చూడాలని కోరుకోవటమూ ఆశ్చర్యంగానే ఉంది.  అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడును కాకుండా కన్నా, పురందేశ్వరిని తలచుకునే జనాలు కూడా ఉన్నారన్న విషయమే ఆశ్చర్యంగా ఉంది. మళ్ళీ బీజేపీ, జనసేనల్లో పోలిక చూసే కమలంపార్టీకన్నా జనసేనకే జనాల మద్దతు కాస్త ఎక్కువగా ఉన్న విషయం అర్ధమవుతోంది.  సర్వే రిజల్టు ప్రకారం చూస్తే దొందు పార్టీలు దొందే అన్న విషయం స్పష్టమైపోతోంది.




ఒసారి చరిత్రలోకి వెళితే మొన్నటి ఎన్నికల్లో  బీజేపికి వచ్చిన ఓట్ల శాతం 0.84. అలాగే జనసేనకు వచ్చిన ఓట్లశాతం సుమారు 5. ఈ రెండు పార్టీలు కలవటం వల్ల ఉపయోగం ఏమిటి ? అంటే ఏమీ లేదనే చెప్పాలి. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందన్న సామెతే గుర్తుకొస్తోంది  రెండు పార్టీల కలయికతో.  అధికారంలోకి వచ్చే విషయాన్ని పక్కన పెట్టేసి ముందు అన్నీ నియోజకవర్గాల్లో ప్రత్యర్ధులకు గట్టి పోటి ఇవ్వగలిగిన అభ్యర్ధులను వెతికి పట్టుకుంటే అదే పదివేలు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో పై రెండు పార్టీల తరపున చాలా నియోజకవర్గాల్లో పోటి చేయటానికి గట్టి అభ్యర్ధులే దొరకలేదు. అందుకనే రెండు పార్టీలకు చాలా నియోజకవర్గాల్లో అసలు డిపాజిట్లే రాలేదు. ఇలాంటి పార్టీలు రెండు కలిసి వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అని ప్రకటిస్తే కామిడిగానే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: