కుంటుపడిన జీవితాలను నడిపించిన ప్రమోద్ కరణ్ సేథీ... నేడు జయంతి
జైపూర్ ఫుట్ ఆలోచన : ఎముకల వైద్య నిపుణుడైన సేథీ 1969లో నిరక్ష్యరాస్యుడైన చేతివృత్తి నిపుణుడు రామచంద్ర శర్మతో కలిసి జైపూర్ ఫుట్ ను రూపొందించాడు. కృత్రిమ కాలు రూపొందించాలనే మెరుపు ఆలోచన వచ్చింది రామచంద్రారావుకే. ఒకనాడు అతడు సైకిల్ తొక్కుతుండగా టైరులోని గాలి పోయిందనీ, అప్పుడు అతడికి హటాత్తుగా ఈ ఆలోచన వచ్చిందనే భావన ప్రచారంలో ఉంది.జైపూర్ ఫుట్ అభివృద్ధి : జైపూర్ ఫుట్ తయారుచేయక ముందు కృత్రిమ కాలు అమర్చుకోవాలంటే ఖర్చు విపరీతంగా ఉండేది. కాబట్టి సేథీ రబ్బరు, చెక్క, అల్యూమినియంతో దీని తయారుచేసి తక్కువ ధరలో సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చాడు. అయిననూ 1975 వరకు కూడా ఈ కృత్రిమ పాదాన్ని అమర్చుకున్నవారు కొద్దిమందే. అప్ఘనిస్తాన్ యుద్ధం తరువాత జైపూర్ ఫుట్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ యుద్ధంలో సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) అమర్చిన మందు పాతరల వల్ల కాళ్ళు కోల్పోయిన అనేక మందికి అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ జైపూర్ ఫుట్లను అమర్చింది. ఆ తరువాత కార్గిల్ యుద్ధంలో కాళ్ళు కోల్పోయిన అనేక సైనికులు కూడా జైపూర్ ఫుట్ లనే అమర్చుకున్నారు. ప్రముఖ నటి సుధా చంద్రన్ కూడా జైపూర్ ఫుట్నే అమర్చుకొని మయూరి చిత్రంలో నటించి పలువురి ప్రశంసలు అందుకొంది.
అవార్డులు : ప్రమోద్ కరణ్ సేథీ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురష్కారంతో సత్కరించగా, అత్యధికులకు కృత్రిమ అవయవం అమర్చినందులకు సేథీ పేరునే గిన్నిస్ బుక్ వారు రికార్డు చేశారు. ఆసియాలోనే అత్యుత్తమమైన మెగ్సేసే అవార్డు కూడా సేథీని వెదుక్కుంటూ వచ్చింది.కాళ్ళు కోల్పోయిన ఎందరికో కృత్రిమ కాళ్ళు అమర్చి వారి జీవితాలలో వెలుగులు నింపిన సేథీ 2007, జనవరి 7 న జైపూర్లో మరణించారు.