సంక్రాంతి : పిల్లాపాపలతో ప్రయాణం ఓ సీరియల్ కథే...!
మొత్తానికి కొత్త ఏడాది తరువాత తొలిపెద్ద పండుగైన సంక్రాంతి రానే వచ్చింది. ఈ పండుగ సమయంలో చిన్న, పెద్ద అందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో దీనిని మూడు రోజుల పాటు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ సంక్రాంతి పండుగ శోభ ఎక్కువగా పట్టణాల కంటే పల్లెల్లోనే బాగా కనపడుతూ ఉంటుంది. వీధుల నిండా రంగురంగుల ముగ్గులు, సంక్రాంతి గొబ్బెమ్మలు, ఇళ్లనిండా పచ్చ తోరణాలు, పూలతో అలంకరణ, చుట్టాల సందడి, పిండి వంటల ఘుమఘుమలు వంటివి ఈ పండుగకు మరింత ఆనందాన్ని తీసుకువస్తాయి.
అయితే ఈ పండుగ సమయంలో ఎక్కువగా పట్టణాల నుండి తమ తమ పల్లెలకు తరలి వెళ్లే వారికి మాత్రం ప్రయాణ ఇబ్బందులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. దాదాపుగా అందరూ కూడా తమ ఊళ్లకు వెళ్లేందుకు ప్రయాణ టిక్కెట్లు బుక్ చేసుకుని సిద్ధం అవుతుంటారు. దానివల్ల బాస్ స్టాండ్ లు, రైల్వే స్టేషన్స్ వంటివి విపరీతమైన జనసందోహంతో కిక్కిరిసిపోతుంటాయి. ఇక పండగ సమయంలో తమ నేటివ్ ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారికి టికెట్ల ధరలు, సీట్ల లభ్యత ఒక సమస్య అయితే, ఇది ఒకరిద్దరు పిల్లలున్నవారికి మరింత భారం అని చెప్పకతప్పదు. ఇక, ఈ పిల్లలు చిన్నారులై, పాలుతాగేవారైతే ఆ కష్టాలతో ఆ తల్లితండ్రులు పడే బాధలు అన్ని ఇన్ని కావనే చెప్పాలి. ముఖ్యంగా సీట్లు దొరక్కపోతే నిలబడి ఆ జనం తాకిడిలో నిలబడి ప్రయాణం చేయడంతో పాటు,
ఆ ఇబ్బందులకు తోడు పిల్లల ఏడుపు, కొద్దిపాటి గోల వంటివి తల్లితండ్రులకు మరింత సమస్యను తీసుకువస్తుంది. అందుకే పిల్లలున్న వారిలో కొందరు, ముందుగానే కళ్ళు తెరిచి తమ ఊళ్లకు వెళ్ళడానికి చాలా రోజుల ముందే టికెట్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ అవి దొరక్కపోతే మాత్రం పండుగ ప్రయాణం వారికి కొంత పెనుభారంగా మాత్రం అవుతుంది. అయినప్పటికీ మొత్తానికి తమ తమ ఇళ్లకు చేరుకొని హాయిగా తమవారితో ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుంటే, ప్రయాణంలో వారు పడ్డ బాధలన్నీ కొట్టుకుపోతాయనే చెప్పాలి....!!