షిర్డీ వివాదం: బాబా చరిత్రను తొక్కేస్తోందెవరు..?
ఇన్నాళ్లూ అయోధ్యలో రామ జన్మభూమి వివాదం చూశాం. ఇప్పుడు తాజాగా శిరిడీలో కొలువైన సాయిబాబా జన్మ స్థలంపై వివాదం నెలకొంది. ఆయన జన్మించినది పథ్రీలోనేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించడంతో వివాదానికి తెరతీసింది. వివరాల్లోకి వెళ్తే.. సాయిబాబా జన్మస్థలం పర్భణీ జిల్లాకు చెందిన 'పాథ్రీ' అని స్థానికులు భావిస్తూ 1999లో శ్రీ సాయి జన్మస్థాన్ మందిరాన్ని నిర్మించారు. వేల సంఖ్యలో భక్తులు అక్కడికి వస్తుండడంతో ఆ పట్టణం అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయనున్నట్టు ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.
ఇక్కడే అసలు గొడవ మొదలైంది. పత్రిని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం ప్రకటనపై షిరిడీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనగా రేపటి నుంచి షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ట్రస్ట్.. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం షిరిడీ గ్రామస్తులతో సమావేశం అవుతోంది. అలాగే మరోవైపు రేపు బంద్కు కూడా పిలుపునిచ్చిన ట్రస్ట్.. సాయి మందిరాన్ని పర్బణి జిల్లాకి తరలించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆరోపించింది.
వాస్తవానికి పర్బణి జిల్లాలోని పథ్రీ అనే ఊరే సాయిబాబా జన్మస్థలమన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. శిరిడీకి ఇది 275 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే పాథ్రీ గ్రామస్థులు మాత్రం బాబా ఇక్కడ పుడితే షిర్డీ వాళ్లు ఆదాయం కోసమే పాత్రిని తొక్కేస్తున్నారని వాళ్లు ఆరోపిస్తున్నారు. మాకు ఆదాయం అవసరం లేదు.. బాబా గారు పుట్టిన జన్మస్థలానికి ప్రయార్టీ ఉండాలని వారు కోరుతున్నారు. షిర్డీ వాళ్లు పాథ్రీ చరిత్ర తొక్కేస్తున్నారని వాళ్లు అంటున్నారు. మరోవైపు షిర్డీ వాళ్లు మాత్రం బాబా 16 ఏట నుంచి ఇక్కడే ఉంటున్నారని షిర్డీ వాళ్లు అంటున్నారు.