షిర్డీ వివాదం: షిర్డీ, పత్రి తేడా ఏంటి.. ఏది నిజం... ఏది అబద్ధం..?
సద్గురు సాయిబాబా జన్మస్థల వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సాయిబాబా భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. సాయిబాబా జన్మించిన ప్రాంతంగా చెపుతోన్న పత్రి, బాబా బాగా ఫేమస్ అయిన షిర్డీ వివాదంలో అసలు ఏది నిజం ? ఏది అబద్ధం ? ఈ వివాదానికి కారణాలు పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉంటాయి. మహారాష్ట్రంలోని పర్బిని జిల్లాకు చెందిన ‘పత్రి’ సాయిబాబా జన్మస్థలం అని స్థానికులు భావించి 1999లో శ్రీ సాయి జన్మస్థాన్ మందిరాన్ని నిర్మించారు. ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు.
ఇక ఇటీవల పత్రి పట్టణాభివృద్ధికి వంద కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా షిర్డీ సంస్థాన్ ట్రస్ట్లో ఆందోళన నెలకొంది. ఈ స్థలంపై వివాదం ఇప్పటి వరకు లేదని కేవలం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే తెరపైకి వచ్చిందంటున్నారు. ఈ వివాదంపై అప్పుడే రాజకీయ ముసురు ఏర్పడింది. ఉద్దవ్ థాక్రే సీఎం అయ్యాకే ఈ వివాదం తలెత్తిందని విపక్ష బీజేపీ ఆరోపిస్తోంది.
ఇక పత్రి , షిర్డీ గురించి చూస్తే షిర్డీ అహ్మద్నగర్ జిల్లాలో ఉంది. పత్రి పర్బిని జిల్లాలో ఉంది. ఈ రెండు ప్రాంతాలకూ మధ్య దూరం 280 కిలోమీటర్లు. పత్రిలో సాయి పుట్టి తర్వాత కాలంలో సాయి.. షిర్డీకి వచ్చినట్లు ఓ విశ్వాసం. ఇక పత్రి అభివృద్ధి చెందితే షిర్డీ ప్రాముఖ్యం తగ్గుతుందని షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ ఆందోళన చెందుతోందన్నది మాత్రం నిజం. ఇక బాబా పత్రిలో పుట్టి 16వ యేట షిర్డీకి వచ్చాడని కొందరు చెపుతుంటే.. షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ వాళ్లు మాత్రం బాబా ఎక్కడ పుట్టాడు అన్నదానికి సరైన ఆథారాలు లేవని చెపుతున్నారు. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందో ? చూడాలి.