తిరుమల యాత్ర ఇలా చేస్తే మహా పుణ్యం..!?

తిరుమల శ్రీనివాసుడు.. తెలుగు వారి ఇష్ట దైవం. కేవలం తెలుగు వారే కాదు.. దేశమంతా ఆయన దర్శనం కోసం బారులు తీరుతుంది. అయితే తిరుమల యాత్ర ఎలా చేస్తే పుణ్యం వస్తుంది.. తిరుమల యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.. ఓసారి చూద్దాం. తిరుమల యాత్ర అలిపిరితో ప్రారంభమవుతుంది. చెప్పులతో శ్రీవారి కొండ ఎక్కరాదన్న విషయం తెలిసిందే. అలిపిరి వద్ద ఉన్న శ్రీవారి పాదరక్షలకు నమస్కారం చేసుకుని పూజించాలి.
తిరుమల వెళ్తే.. శిరోముండనం తప్పనిసరిగా చాలామంది చేయించుకుంటారు. కొందరు కేవలం మొక్కు తీర్చుకునేందుకే వస్తారు. గతంలో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆడా మగా అంతా తలనీలాలు ఇచ్చే వారు. కానీ.. ఇప్పుడు చాలా మంది ఆడవారు తలనీలాలు ఇవ్వకుండా మూడు కత్తెర్లతో మొక్కుబడి కానిచ్చేస్తున్నారు. కానీ.. ఇది కేవలం ఓ ఆచారం మాత్రమే కాదు.. మనిషికి  సౌందర్యమనే అహంకారం కలుగుకుండా చేసేదే ఈ శిరోముండనం ఆచారం.
మనిషి తలనీలాలు తీస్తే సహజ స్వరూపం బయటపడుతుంది. అలంకార, సౌందర్య అహంకారం నశిస్తుంది. గుండు చేయించుకుని అద్దంలో చూసుకుంటే ఎలాంటి మనో వికారాలు లేక ప్రశాంతమైన స్థితి కలుగుతుంది. శిరో ముండనం తర్వాత ఆలయ ప్రవేశము చేస్తే ఆ ఏడుకొండలవాడి దివ్యస్వరూపాన్ని చూడాలనే తపన పెరుగుతుంది.కోటిసూర్యకాంతుల సమప్రభుడైన శ్రీనివాసుని దర్శనం అపరిమితమైన ఆనందాన్ని కలిగిస్తుంది.
అయితే ఇప్పుడు చాలామంది తమ అధికార బలంతో.. పలుకుబడితో తిరుమలలో సకల సౌకర్యాల కోసం వెంపర్లాడుతుంటారు. సిఫార్సులు, పలుకుబడి ఉపయోగించి దర్శనం సాఫీగా జరిగేలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. ఆ శ్రీనివాసుడిని ఓ సామాన్యుడిగా దర్శించుకుంటేనే అందులో సాఫల్యం కలుగుతుంది. అందుకే శ్రీవారి యాత్రను పరమ నిష్టంగా చేయండి. అలౌకిక ఆనందం పొందండి. ఆ ఏడు కొండలవాడి దర్శనం పూర్వజన్మసుకృతం. సర్వపాప హరణం. ఆ దివ్యమంగళ స్వరూప దర్శనం.. అపూరూపం.. అనిర్వచనీయం..అందుకే తిరుమల యాత్రను మరపురాని యాత్రగా మార్చుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: