రైతులు మన దేశానికి వెన్నెముక. అటువంటి రైతులు పచ్చగా ఉండాలన్నా , వారి జీవితాలు ప్రశాంతంగా సాగిపోవాలన్నా వారు పండించే పంటలు ఎటువంటి సమస్యలు రాకుండా చేతికి అందాలి. కానీ ఈ రోజుల్లో వ్యవసాయం చేసే రైతులు క్రమ క్రమంగా తగ్గిపోతున్నారు. అయితే ఇందుకు వారి కష్టంతో పాటు దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి. అయితే దేవుని యొక్క కృపను పొందడానికి రైతులు ఎన్నో ప్రత్యేక పూజలు పండుగలు చేస్తుంటారు. అటువంటి ముఖ్యమైన వాటిలో ఏరువాక పూర్ణిమ కూడా ఒకటి. జేష్ఠ పూర్ణిమను రైతులు పెద్ద పండుగలా జరుపుకుంటారు. దీనినే ఏరువాక పూర్ణిమ అని కూడా అంటారు. వర్ష ఋతువు మొదలయ్యే సందర్భంగా పంట పనులు ప్రారంభించే ముందు ఈ పండుగను జరుపుకోవడం మన పూర్వీకుల నుండి ఆనవాయితీగా వస్తోంది.
ఈ పండుగ రోజున రైతులు పొద్దున్నే లేచి స్నానమాచరించి వారు వ్యవసాయానికి ఉపయోగించే ఎద్దులను శుభ్రపరుచుకుని అందంగా అలంకరిస్తారు. వాటి కొమ్ములకు రంగులను అద్ది అందంగా ముస్తాబు చేస్తారు. అనంతరం ఆ ఎద్దులకు పూజలు చేసి అంతా మంచే జరగాలని కోరుకుంటారు. వాటికి తమ చేతులతో స్వయంగా ఆహారాన్ని పెట్టి ఆనందంగా ఉండేలా చేస్తారు. ఆ తర్వాత పొలాల వద్దకు వెళ్లి వారు పండించే భూమికి పూజలు చేస్తారు. ఆ మేళ తాళాలతో ఊరేగిస్తూ పెద్ద పండుగలా ఊరంతా కలిసి సంబరాలు జరుపుకుంటారు.
ఇలా ఏరువాక పూర్ణిమను ఎంతో భక్తి శ్రద్ధలతో చేయడం వలన దేవుని యొక్క అనుగ్రహం పొంది పంట చక్కగా పండి చేతికి అంది వస్తుందని అంతా మంచి జరిగి లాభాలు వస్తాయని వారి యొక్క విశ్వాసం. ఈ ఏరువాక పూర్ణిమ రోజున రైతులు చేసే పూజలకు మంచి ఫలితం లభిస్తుందని వారి యొక్క నమ్మకం. అందుకే ఈ ఏరువాక పూర్ణిమ రైతులకు ఎంతో ముఖ్యమైనది, ప్రధానమైనది.