వరలక్ష్మీ వ్రతం పక్క రోజు... తప్పక పాటించాల్సిన నియమాలివే ?
శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేసుకుంటాము. అయితే వ్రతంలో ఉంచిన కలశాన్ని చాలా మంది అదే రోజు కదుపుతుంటారు. అంటే సాయంత్రం దీపం కొండెక్కాక కలశాన్ని తీయాలని అనుకుంటారు. కానీ శుక్రవారం రోజున కలశాన్ని అసలు తీయకూడదు, కనీసం కదప కూడదు. మరి కొందరు మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు జరిపి ఆదివారం నాడు కలశాన్ని తీస్తుంటారు. కానీ ఈ పద్ధతి కూడా సరైనది కాదని సకల శాస్త్రాలు చదివిన పండితులు అంటున్నారు. వరలక్ష్మీ వ్రతం అయిన మరుసటి రోజు అనగా శనివారం నాడు కలశాన్ని తీయడానికి అనువైన సమయము. శనివారం రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేసి, అమ్మ వారికి ఉప్పు లేకుండా కలిపిన పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
ఎంతో శ్రద్ధగా మంత్రాలతో అమ్మవారిని పూజించి దీపాలు కొండెక్కాక మొదట పసుపుతో చేసినటువంటి గణపతిని తీస్తూ 'యధాస్థానం ప్రతి గచ్ఛతి' అని చెప్పి నమస్కరించుకోవాలి. ఆ పసుపుని పుణ్య స్త్రీలు తమ మాంగళ్యాలకు రాసుకోవాలి. ఆ తరువాత అమ్మవారికి నమస్కరించుకుని ఆసనాన్ని, అలాగే కలశాన్ని కూడా తీసి యధాస్థానంలో పెట్టవచ్చు. ఇదంతా వరలక్ష్మి అయిన మరుసటి రోజు అనగా శనివారం రోజు మాత్రమే చేయాలి.