తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.. అసలు కారణాలేంటి?

Amruth kumar
కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండల వాడు శ్రీవేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో ప్రస్తుత పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. సాధారణంగా వీకెండ్ వచ్చిందంటే చాలు.. తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోవాలి. కానీ, ఈసారి సీన్ మారింది. శుక్రవారం, శనివారం కూడా భక్తుల రద్దీ సాధారణ స్థాయిలోనే ఉండటం గమనార్హం. అసలు తిరుమలలో ఎప్పుడూ లేని విధంగా ఈ మార్పుకు కారణాలేంటి? టీటీడీ అధికారులు ఏమంటున్నారు?



భక్తుల రాక తగ్గడానికి  కారణం!

సాధారణంగా తిరుమలలో రద్దీ తగ్గడానికి మూడు ప్రధాన కారణాలను అధికారులు అంచనా వేస్తున్నారు.

మంటలు పుట్టిస్తున్న ఎండలు: వేసవి తీవ్రత దృష్ట్యా భక్తులు ప్రయాణాలకు వెనకాడుతున్నారు.

యుద్ధం ఎఫెక్ట్: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం పరోక్షంగా ఆధ్యాత్మిక పర్యటనలపై పడింది.

సీజన్ ఎఫెక్ట్: పరీక్షల ఫలితాలు రావడం, పెళ్లిళ్ల సీజన్ పీక్ లో ఉండటంతో చాలా మంది తమ ఇంటి శుభకార్యాలు ముగించుకుని శ్రీవారిని దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు.



కోటి విరాళం ..
శ్రీవారిపై భక్తితో కోటి రూపాయల విరాళం ఇచ్చే దాతల కోసం టీటీడీ ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తోంది. వీరికి దర్శనం నుంచి వసతి వరకు 'ప్రెసిడెన్షియల్' స్థాయి సౌకర్యాలు లభించనున్నాయి. భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో, దాతలకు మరింత వేగంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం కలుగుతోంది.



వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అప్‌డేట్!

ఒకప్పుడు తిరుమల అంటే కేవలం పెద్దలకే అనుకునేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. యువత కూడా భారీగా తిరుమలకు క్యూ కడుతున్నారు. కేవలం భక్తి కోసమే కాదు, తిరుమలలోని ఆహ్లాదకరమైన ప్రకృతి, ఆ మానసిక ప్రశాంతత కోసం యువత ఏడుకొండల వాడిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కేవలం 8 కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు కేవలం 6 గంటల్లోనే దర్శనం అవుతోంది. ఇది భక్తులకు ఒక రకంగా శుభవార్తే!



హుండీ ఆదాయం - భక్తుల సంఖ్య!

నిన్న ఒక్కరోజే 65,534 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 24,560 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల రద్దీ కాస్త తగ్గినా, శ్రీవారి హుండీ కాసులు మాత్రం కిటకిటలాడుతున్నాయి. నిన్న ఒక్కరోజు వచ్చిన హుండీ ఆదాయం అక్షరాలా 3.22 కోట్ల రూపాయలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: