దసరా పండుగ సందర్భంగా వివిధ వ్యాపార సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటించడం చూస్తూనే ఉంటాం...... కానీ దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రత్యేక రైళ్ళను అందుబాటులోకి తేవడమే కాకుండా ప్రత్యేక సర్వీసులు ఈ నెల 10వ తేదీ వరకు అందుబాటులో తీసుకొచ్చింది. దసరా పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్ళటానికి చాటంత వెయిటింగ్ లిస్టు చూసి రిజర్వేషన్ చేసుకోవడానికి భయపడుతున్న ప్రయాణికుల కోసం అధికారులు ప్రత్యేక సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దసరా పండుగ పూర్తయ్యే వరకు సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి సికింద్రాబాద్కు గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు పేర్కొన్నారు అధికారులు.
మరొక విశేషమేంటంటే.. ఈ రైళ్లలో రిజర్వేషన్ సమస్య అంతగా ఉండదు. ఎందుకంటే దసరా దృష్ట్యా ప్రత్యేకంగా నడుపుతున్న ఈ రైళ్లలోోో ఎక్కువ సంఖ్యలో జనరల్ భోగీలనే ఏర్పాటు చేశారు.
అంటే ఈ రైళ్లలో 14 జనరల్ బోగీలు ఉండనున్నాయి.
ఈ రైళ్లు ప్రతిరోజూ సికింద్రాబాద్ నుంచి విజయవాడకు సర్వీసులను అందించనున్నాయి. దసరా పండుగ తర్వాత రెండు రోజుల వరకు కూడా ఈ రైళ్లు నడుస్తాయి. రెగ్యులర్, ప్రత్యేక రైళ్లలో టిక్కెట్లు బుక్ చేసుకోలేకపోయినవారు ఈ జనరల్ రైళ్ల సేవలను వినియోగించుకోవచ్చు. .ట్రైన్ నంబర్.07192 సికింద్రాబాద్- విజయవాడ రైలు ఈ నెల 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిత్యం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి మీదుగా సాయంత్రం 5.20కి గుంటూరు, మంగళగిరి, రాత్రి 7 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
నంబర్.07193 విజయవాడ-హైదరాబాద్ జనసాధారణ రైలు ఈ నెల 2 నుంచి 10వ తేదీ వరకు రాత్రి 8.15 గంటలకు బయలుదేరి మంగళగిరి, 9.15కి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి మీదుగా సికింద్రాబాద్, వేకువజామునకు 3 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.