మకర సంక్రాంతి పండుగ భోదించే ఆధ్యాత్మికత

ఈ సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని "సంక్రాంతి" గా పెద్దలు వివరణ చెబుతూ "మకరం" అంటే! మొసలి. ఇది పట్టుకుంటే వదలదు అని మనకు తెలుసు.  మానవుని యొక్క ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డుతగులుతూ, మొక్షమార్గానికి అనర్హుని చేయుటలో ఇది అందవేసిన చేయి! అందువల్ల ఈ "మకర సంక్రమణం" పుణ్యదినాలలో దీని బారినుండి తప్పించుకునేందుకు ఒకటే మార్గం అది ఎవరికి వారు యధాశక్తి 'లేదు' అనకుండా దానధర్మాలు చేయుటయే మంచిదని, పెద్దలు చెబుతూ ఉంటారు. 



'మకర సంక్రాంతి' సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే పవిత్రమైన రోజు. ఈ పండుగకు రైతుల ఇంటికి ధనధాన్యరాశులు చేరతాయి. పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహప్రాంగణాలతో, ఇళ్ళు లోగిళ్ళు ఒక నూతన వింత శోభ సంతరించుకుంటాయి. కాంతులీను తుంటాయి. ప్రకృతి ఆధిత్యునితో కూడి నవశకానికి నాంది పలుకుతుంది. హిందు పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది. ఈ పండుగకు నవసొబగులు తీసుకురావడానికి పది రోజుల ముందే ఇళ్ళకు సున్నాలు, రంగులు వేయడం సాంప్రదాయం.

సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో స్వీట్స్ తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో ఈ పండుగ వస్తుందంటే పిండివంటలతో అందరి ఇళ్ళు ఘుమఘుమ లాడుతూ ఉంటాయి నువ్వుల ముద్దలు, అరిసెలు, సకినాలు, చెగోడిలు, పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన పిండి వంటకాలు చేసుకుని కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. 

గంగిరెద్దులవారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయిరాగాలకు అనుగుణంగా వాటిచే చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి ఆ గంగిరెద్దులు మనమిచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు.

ఇక హరిదాసులు హరిలో రంగహరీ! అంటూ నడినెత్తిపై నుంచి ముక్కువరకు తిరునామంతో కంచుగజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ తలపై రాగి అక్షయ పాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. 

వాస్తవానికి ఖగోళ ప్రకారంగా డిసెంబర్ 22 నుండి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది,కాని మనకు ధనుర్మాసం ఈ రోజుతో పూర్తి అవ్వడం వలన సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్య దినాలుగా పరిగణనలోకి తీసుకుంటారు.


పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించిన వారు స్వర్గానికి వెళ్తారని విశ్వసిస్తారు. అందుకే మహాభారతంలో స్వచ్ఛంద మరణ వరం కలిగిన భీష్మాపితామహుడు ఈ పర్వదినం వరకు ఎదురుచూసి ఉత్తరాయణంలో రథసప్తమి - మాఘ శుద్ధ సప్తమి నాడు మొదలుకోని తన పంచ ప్రాణాలను రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ చివరకు మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి మొక్షం పొందాడు. 

జగద్గురువు ఆది శంకరాచార్యుడు ఈ రోజునే సన్యాసం స్వీకరించాడు. పూర్వము గోదాదేవి పూర్వఫల్గుణ నక్షత్రంలో కర్కాటక లగ్నంలో తులసివనంలో జన్మించినది.ఆమె గోపికలతో కలిసి శ్రీకృష్ణుడిని ఆరాధించినది ధనుర్మాసం మొత్తం ఒకనెల రోజు లు నిష్టతో వ్రతమాచరించి చివరి రోజైన మకర సంక్రాంతి నాడు విష్ణుమూర్తిని పెళ్ళి చేసుకుంది.



ఈ విధంగా మకర సంక్రాంతి ఎన్నో ఆధ్యాత్మిక ప్రత్యేకతలను చోటు చెసుకుంది, వినూత్న కాంతులతో వెలుగులీనే ప్రకృతి సొబగులతో ఆ ఆధిత్యుని క్రాంతితో విలసిల్లే తరుణం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: