ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు బ్యాట్స్ మెన్ ర్యాకింగ్స్ జాబితాలో టీమిండియా సారథి కింగ్ కోహ్లి అగ్ర స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. యాషెస్ సిరీస్ లో అద్భుత ప్రదర్శన కనబర్చి గత కొన్ని నెలలుగా ఈ జాబితాలో మొదటి స్థానం లో కొనసాగిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయాడు.
ఇటీవల సొంత గడ్డపై పాకిస్థాన్ తో జరిగిన టెస్టు సిరీస్ లో స్మిత్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దాంతో అతను నెంబర్ 1 ర్యాంక్ ను కోల్పోయాడు. ప్రస్తుతం 928 పాయింట్ల తో కోహ్లి నెంబర్ 1 ర్యాంక్ లో కొనసాగుతుండగా స్మిత్ 923 పాయింట్ల తో రెండో స్థానం లో వున్నాడు. కాగా ఈ జాబితాలో కోహ్లి తరువాత టీమిండియా తరపున పుజారా 791 పాయింట్ల తో నాలుగో స్థానం లో 759పాయింట్ల తో టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఆరవ స్థానం లో కొనసాగుతున్నారు.
ఇదిలా ఉంటే ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ జాబితాలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ 10ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు. గత కొన్ని నెలల నుండి షమీ సూపర్ ఫామ్ తో అదరగొడుతుండడంతో అతను తాజాగా కెరీర్ బెస్ట్ ర్యాంక్ ను చేరుకున్నాడు.