గంగూలీ ఆ మ్యాచ్తోనే హర్భజన్కు ఫిదా అయ్యారు
2001 సంవత్సరం భారత టెస్టు క్రికెట్లో మరిచిపోలేనిది. ఎందుకంటే భారత టెస్టు క్రికెట్లో ఆ సంవత్సరమే ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అప్పటికే క్రికెట్ ప్రపంచాన్ని 16 వరుస విజయాలతో శాసిస్తున్న ఆస్ట్రేలియా జట్టును ఈడెన్గార్డెన్స్లో భారత్ ఓడించిన తీరు క్రికెట్ ప్రేమికులకు ఎప్పుడు గుర్తుండిపోతుంది.
అయితే మరోసారి తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆ మ్యాచ్ గురించి ప్రస్తావించాడు. వివిఎస్ లక్ష్మణ్ ఆ మ్యాచ్లో చారిత్రాత్మక ఇన్నింగ్స్తో పాటు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ను అందరూ గుర్తు పెట్టుకునే ఉంటారు. కాగా, గంగూలీ మేము గెలవడానికి బ్యాట్సమెన్ సహకారం ఆ మ్యాచ్లో ఎంత ఉందో బౌలర్ల కృషి కూడా అంతే ఉందని అభిప్రాయపడ్డాడు.
ఇక సౌరవ్ గంగూలీ ఆ మ్యాచ్కు సంబంధించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ..' ఈడెన్ టెస్టు మ్యాచ్లో నా సూచనలతో బౌలింగ్కు దిగి హర్భజన్ హ్యాట్రిక్తో మెరవడం, మొత్తం 13 వికెట్లు అదే మ్యాచ్లో పడగొట్టడం చకచకా జరిగిపోయాయి. ఆ మ్యాచ్ తర్వాత హర్భజన్ ప్రదర్శనను చూసి నేను అతని ఆటకు ఫిదా అయిపోయా. ఎందుకంటే అప్పటకే 15 వరుస విజయాలు ఆస్ట్రేలియా సాధించి అప్రతిహాతంగా దూసుకుపోతుంది. మా గడ్డపై స్టీవా నేతృత్వంలో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా మొదటి టెస్టును గెలిచి 16వ విజయం తమ ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో ఈడెన్లో జరిగిన రెండో టెస్టులో చారిత్రాత్మక విజయంతో పాటు ఆ తర్వాత సిరీస్ను గెలుచుకోవడం జరిగింది.
ఇక అక్కడి నుంచి హర్భజన్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 700 పైగా వికెట్లు అంతర్జాతీయ క్రికెట్లో సాధించి ఈ దశాబ్దపు అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. అనిల్ కుంబ్లే, హర్భజన్లు సమకాలీన భారత క్రికెట్లో మా జట్టులో ఉండడం మేం చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఈ ఇద్దరు కలిసి ఎన్నో టెస్టు మ్యాచ్లో భారత జట్టుకు అపూర్వమైన విజయాలు అందించారని' దాదా చెప్పుకొచ్చాడు.అయితే 2001లో కీలకమైన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్కు దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లేతో పాటు ఫాస్ట్ బౌలర్ జగవల్ శ్రీనాథ్లు గాయంతో దూరమయ్యారని గంగూలీ పేర్కొన్నాడు.ఈడెన్ గార్డెన్లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హ్యాట్రిక్తో మెరవడం, 13 వికెట్లు రెండు ఇన్నింగ్స్లో తీసుకున్నాడు. మొత్తం ఆ సిరీస్లో హర్భజన్ మూడు టెస్టుల్లో కలిపి 32 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు.