న్యూజిలాండ్ , భారత్ లమధ్య జరిగిన మొదటి రెండు మ్యాచ్ లు ఏకపక్షంగా సాగినా.. మూడో టీ 20 మాత్రం ఉత్కంఠ భరితంగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్ల లో 5వికెట్ల నష్టానికి భారత్ 179పరుగులు చేసింది. భారత బ్యాట్ మెన్ లలో రోహిత్ శర్మ (65),కోహ్లీ (38)రాణించారు. అనంతరం లక్ష్య ఛేదన కు దిగిన న్యూజిలాండ్ కూడా 20ఓవర్ల లో 6వికెట్ల నష్టానికి 179 పరుగులే చేయడం తో మ్యాచ్ టై అయ్యింది. 95పరుగులతో విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ఆడగా గప్తిల్ (31)రాణించాడు.
ఇక మ్యాచ్ టై కావడం తో సూపర్ ఓవర్ నిర్వహించగా న్యూజిలాండ్ ఆరు బంతుల్లో 17పరుగులు చేసింది. మ్యాచ్ ఆద్యంతం స్టార్ పేసర్ బుమ్రా తీవ్రంగా నిరాశ పరిచాడు. అనంతరం 18పరుగుల లక్ష్యంతో భారత ఓపెనర్లు రోహిత్ ,రాహుల్ బరిలోకి దిగగా.. సౌథీ బంతిని అందుకున్నాడు. మొదటి బంతికి రోహిత్ రెండు పరుగులు తీయగా రెండో బంతి కి ఓ పరుగు లభించింది. ఇక మూడో బంతిని ఫోర్ గా మలిచిన రాహుల్ , నాల్గో బంతికి సింగిల్ తీశాడు. దాంతో చివరి రెండు బంతుల్లో 10పరుగులు అవసరం కాగా ఆ రెండు బంతులను రోహిత్ శర్మ రెండు సిక్సర్లు బాదడం తో టీమిండియా ఘన విజయం సాధించింది. దాంతో 5మ్యాచ్ ల టీ 20సిరీస్ ను భారత్ మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే 3-0 తో సిరీస్ ను కైవసం చేసుకుంది.