న్యూజిలాండ్ తో ప్రస్తుతం జరుగుతున్న 5మ్యాచ్ ల టీ 20సిరీస్ ను హ్యాట్రిక్ విజయాల తో మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే భారత్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా ఈమూడు మ్యాచ్ లను కూడా సిక్స్ తో గెలవడం విశేషం. అందులో భాగంగా మొదటి టీ 20 లో 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా 19ఓవర్ చివరి బంతికి సిక్స్ కొట్టి శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ ను ముగించాడు అలాగే రెండో టీ 20లో132 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 17ఓవర్ మూడో బంతిని సిక్స్ గా తరలించి ఆల్ రౌండర్ శివమ్ దూబే మ్యాచ్ ను పూర్తి చేశాడు.
ఇక బుధవారం జరిగిన మూడో టీ 20 లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడం తో మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్ళింది. సూపర్ ఓవర్ చివరి బంతిని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సిక్స్ కొట్టి భారత్ కు అసాధారణ విజయం అందించాడు. అలా మూడు మ్యాచ్ లను టీమిండియా సిక్సర్ల తో ముగించింది. ఇదిలావుంటే ఇరు జట్ల మధ్య నాలుగో టీ 20 శుక్రవారం వెల్లింగ్టన్ లో జరుగనుంది. కనీసం ఈమ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని న్యూజిలాండ్ భావిస్తుండగా భారత్ మాత్రం సిరీస్ క్లీన్ స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది.