ఆ విషయాన్నీ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా : కేఎల్ రాహుల్
ప్రపంచంలోని ప్రతి జట్టుకు సాధారణంగా ఆడే మ్యాచ్ లలో ఎలా ఉన్నప్పటికీ ప్రపంచకప్ మాత్రం ఒక కలగా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. క్రికెట్లోని ప్రతి ఆటగాడు లక్ష్యం ప్రపంచ కప్ లో ఆడి సత్తా చాటి జట్టుకు ప్రపంచ కప్ సాధించి పెట్టడం. అందుకే ప్రపంచ కప్ కోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు ఆటగాళ్ళు. ఇక ప్రపంచ కప్ లో అడుగుపెట్టిన తర్వాత అన్ని జట్లను ఓడిస్తూ వచ్చి విజయపరంపర కొనసాగిస్తూ వచ్చి.. చివరికి అడుగు దూరంలో వెనుదిరిగితే అది ఎంతో బాధను కలిగిస్తుంది. గత ఏడాది టీమిండియా ఆటగాళ్లు అందరికీ ఇలాంటి ఓ విచారకర సంఘటన ఎదురైంది. 2019 ప్రపంచ కప్ లో అన్ని జట్లను ఓడిస్తూ చివరికి సెమీఫైనల్ వరకు చేరుకుంది భారత జట్టు.
సెమీఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో పోటీ పడింది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో చివరికి టీమిండియా ఓటమి పాలు కావలసి వచ్చింది. చివరి వరకు ఎంతగానో పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఒక అడుగు దూరంలో ప్రపంచకప్ టీమిండియాకు అందని ద్రాక్షలా మారడంతో ఆటగాళ్లు అనుభవించిన వేదన వర్ణనాతీతం అనే చెప్పాలి. టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఏకంగా డ్రెస్సింగ్ రూమ్లో కన్నీటి పర్యంతమయ్యారు. ధోనీ సైతం కన్నీళ్లు పెట్టుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది .
అయితే తాజాగా వరల్డ్ కప్ లో అడుగు దూరంలో వెనుదిరగడం గురించి టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలయ్యి అడుగు దూరంలో వెనుదిరిగిన ఘటన తనతో పాటు తన జట్టును కూడా ఇంకా వెంటాడుతూనే ఉంది అంటూ కె.ఎల్.రాహుల్ వ్యాఖ్యానించారు. గ్రూప్ దశలో అద్భుత ప్రదర్శన చేస్తూ దూసుకుపోయిన జట్టు సెమీస్లో ఓడిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ రాహుల్ తెలిపాడు. జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఆ పరాజయాన్ని ఇంకా మర్చిపోలేదని... ఇక ఓటమిని సీనియర్ ఆటగాళ్లు ఎలా తీసుకున్నారో మాత్రం తనకు తెలియదు అంటూ వ్యాఖ్యానించారు కేఎల్ రాహుల్.