రేపు గ్రీన్ పార్క్ స్టేడియం లో న్యూజిలాండ్ తో జరిగే రెండు మ్యాచ్ల సిరీస్ లో ప్రారంభ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడని భారత స్టాండ్ ఇన్ కెప్టెన్ అజింక్య రహానే ధృవీకరించాడు. ఓపెనింగ్ గేమ్ సందర్భంగా రహానే మీడియాతో మాట్లాడుతూ.. శ్రేయాస్ అయ్యర్ అరంగేట్రం చేయబోతున్నాడు అని ప్రకటించాడు. ఇటీవల ముగిసిన టీ 20 సిరీస్ లో న్యూజిలాండ్ను 3-0 తో ఓడించిన భారత్ ఆత్మవిశ్వాసం తో పోటీలోకి దిగుతుందని భావిస్తున్నారు. అయితే కేఎల్ రాహుల్ కు గాయం కావడంతో ఇప్పుడు ముగ్గురు టాప్-క్లాస్ బ్యాట్స్మెన్ సేవలు జట్టుకు లేకుండా పోయాయి. ఇంతకముందే విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కు దూరమయ్యారు. ఇటీవలి కాలంలో పనిభారాన్ని దృష్టి లో ఉంచుకుని కోహ్లీ, రోహిత్ లకు విశ్రాంతినిస్తున్నారు. రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి వారికి కూడా భారతదేశం విశ్రాంతి ఇచ్చింది. కాబట్టి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఏ కాంబినేషన్తో సుఖంగా ఉంటాడో చూడాలి.
ఇక 2017 భారత జట్టులోకి అరంగేట్రం చేసిన శ్రేయాస్ తన టెస్ట్ క్యాప్ పొందడానికి 4 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. ముంబై తరఫున ఆడుతున్న 26 ఏళ్ల యువకుడికి అద్భుతమైన ఫస్ట్ క్లాస్ రికార్డు ఉంది మొత్తం 54 మ్యాచ్ లలో 52.18 సగటుతో 4,592 పరుగులు. అయ్యర్ 12 ఫస్ట్ క్లాస్ సెంచరీలు కొట్టాడు, అతని అత్యుత్తమ స్కోరు 202 నాటౌట్. ఇక గాయపడిన కేఎల్ రాహుల్ కు బదులుగా జట్టు లో సూర్యకుమార్ యాదవ్ ని చేర్చారు. అయితే ఈ బ్యాటర్ కూడా మిడిల్ ఆర్డర్ స్థానంలో పోటీ లో ఉంటాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు అయ్యర్ రావడం తో సూర్యకుమార్ కు అవకాశం కష్టమే అని చెప్పాలి.