టీమిండియాలో డెప్త్ ఉంది.. కానీ అలా జరిగితేనే గెలుస్తుంది?
గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఓటమి ఎరుగని జట్టుగా అటు ఫైనల్ వరకు దూసుకుపోయిన టీమిండియా.. ఫైనల్ లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది .దీంతో భారత అభిమానులు నిరాశలో మునిగిపోయారు. అయితే మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది. ప్రపంచ కప్ లో ఈసారి టీమిండియా ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనే విషయంపై అందరూ దృష్టి ఉంది అని చెప్పాలి. ఇదే విషయం గురించి ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ రివ్యూ ఇస్తున్నారు. కాగా ఈ విషయంపై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
యూఎస్, వెస్టిండీస్ వేదికలుగా జరగబోయే టి20 వరల్డ్ కప్ లో బరిలోకి దిగుతున్న భారత జట్టు ఎంతో బలంగా కనిపిస్తుంది అంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. సత్తాకు తగ్గట్టుగా ఆడితే టోర్నీలో ఏ జట్టునైనా టీమిండియా ఓడిస్తుంది అంటూ అభిప్రాయపడ్డాడు. స్క్వాడ్ లో చాలా డెప్త్ ఉందని.. కప్పు గెలిచే అవకాశాలు భారత్ కి ఎక్కువగా ఉన్నాయి అంటూ ఇటీవల ఒక క్రీడా ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మోర్గాన్. కాగా జూన్ రెండవ తేదీ నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుండగా జూన్ 9వ తేదీన మొదటి మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా.