గంగూలీ కోపానికి కారణం ఏమిటి?

Suma Kallamadi
అవును, మీరు విన్నది నిజమే. బెంగాల్ టైగర్, టీం ఇండియా మజీ కెప్టెన్, సౌరభ్ గంగూలీకి ముక్కుమీద కోపం వచ్చిందని సమాచారం. విషయం ఏమిటంటే, దాదాను టార్గెట్ చేస్తూ ఓ యూట్యూబర్ సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియో పోస్ట్ చేసాడు. దాంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సౌరభ్ గంగూలీ.. సదరు యూట్యూబర్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక అసలు విషయంలోకి వెళితే, గంగూలీపై ఇలా అభ్యంతరకర వీడియోలు పోస్ట్ చేసిన యూట్యూబర్ పేరు "మృణ్మోయ్ దాస్." కోల్ కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్జీ కార్ ఆస్పత్రిలో నైట్ డ్యూటీ చేస్తున్న ట్రైనీ వైద్యురాలిపై జరిగిన ఘోరం యావత్ దేశాన్నే కాకుండా ప్రపంచాన్ని కూడా కదిలించింది.
ఈ సందర్భంగా ఆమెకు మద్దతుగా కోల్ కతాలో జరిగిన క్యాండిల్ లైట్ ప్రొటెస్టులో దాదా పార్టిసిపేట్ చేసిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. కాగా ఈ వ్యవహారంపై స్పందించిన గంగూలీ... ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా అప్పుడప్పుడూ జరుగుతున్నాయని, అయితే ఈసారి దురదృష్టవశాత్తు ఆస్పత్రులో ఈ సంఘటన జరగడం ఘోరం అని, దానివలన ప్రతీచోటా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అని సూచించారు. దీంతో... ఈ వ్యాఖ్యలపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి! దీంతో గంగూలీ స్పందించాడు కూడా. ఈ క్రమంలో తన వ్యాఖ్యల్ని మీడియా తప్పుగా అర్థంచేసుకుందని వివరణ కూడా ఇచ్చాడు.
ఇకపోతే గంగూలీ పోస్టును ఆయుధంగా చేసుకున్న యూట్యూబర్ మృణ్మోయ్ దాస్ వీడియోలతో వరుసగా గంగూలీపై దాడిచేసాడు. దీంతో... ఈ వీడియోలపై గంగూలీ సీరియస్ అవుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గంగూలీ కార్యదర్శి పశ్చిమ బెంగాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. గంగూలీ ప్రతిష్టకు హాని కలిగించే పదజాలం ఉపయోగించి, అవమానకర వ్యాఖ్యలు చేశాడని సదరు యూట్యూబర్ పై గంగూలీ ఆరోపణలు చేసారు. ఇది దాడి మాత్రమే కాకుండా ప్రతీ వ్యక్తికి దక్కాల్సిన గౌరవానికి భగం కలిగించేలా వ్యాఖ్యానించారని పేర్కొన్నాడు. ఈ విషయంలో తనకి న్యాయం జరిగేలా వేగంగా అవసరమైన చర్యలు తీసుకుంటారని విశ్వసిస్తున్నామని ఆయన పోలీసులకు విన్నవించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: