ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో భారత్ జట్టు తన అగ్రస్థానాన్ని కాపాడుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆదివారం ఐదు మ్యాచ్ల యాషెస్ టెస్టు సిరీస్ ముగియగా సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. దీంతో రెండు జట్లూ పాయింట్లను 56-56తో సమంగా పంచుకున్నాయి. ప్రతి సిరీస్కి ఐసీసీ 120 పాయింట్లను కేటాయించనుండగా మ్యాచ్ల సంఖ్య ఆధారణంగా వాటిని విభజించనున్నారు. ఈ మేరకు ఐదు టెస్టుల యాషెస్లో రెండింటిలో గెలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్కి తొలుత 48 పాయింట్లు దక్కగా, సిరీస్లోనే ఒక మ్యాచ్ డ్రాగా ముగియడంతో చెరో 8 పాయింట్లు దక్కాయి. మొత్తంగా 56 పాయింట్లతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.
వెస్టిండీస్ గడ్డపై ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్ని 2-0తో క్లీన్స్వీప్ చేసిన భారత్కి 120 పాయింట్లు దక్కాయి. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఆ తర్వాత న్యూజిలాండ్ (60), శ్రీలంక (60) టాప్-3లో ఉన్నాయి.
ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగగా చెరొక మ్యాచ్లో గెలిచి సిరీస్లో కేటాయించిన 120 పాయింట్లని పంచుకున్నాయి. ఇక భారత్ చేతిలో రెండు టెస్టుల్లో ఓడిన విండీస్ ఇంకా ఖాతా తెరవకపోగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఈ ఏడాది ఆగస్టు తర్వాత ఒక్క టెస్టు కూడా ఆడలేదు.
ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభమవగా. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ రూపంలో మొత్తం తొమ్మిది దేశాలు పోటీపడుతున్నాయి. ప్రతి జట్టూ సొంతగడ్డపై మూడు టెస్టు సిరీస్లు, విదేశీ గడ్డపై మూడు సిరీస్లు ఆడనుంది. మొత్తంగా 27 సిరీస్ల్లో 71 టెస్టులు జరగనున్నాయి. రెండేళ్ల ఈ ఛాంపియన్షిప్లో ఆఖరిగా టాప్-2లో నిలిచిన జట్ల మధ్య 2021 జూన్ నెలలో ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు టెస్టు ఛాంపియన్గా నిలవనుంది.ఇక ముందు జరగబోయే ఈ రేసులో భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.