ఐసీసీ మరో దిద్దుబాటు చర్య ..సూపర్ ఓవర్ నిబంధన మార్పు
ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు విశ్వవిజేతగా ఆవిర్భవించడానికి అదృష్టం దోహదపడిందన్నది జగమెరిగిన సత్యమే . అంతర్జాతీయ క్రికెట్ మండలి ( ఐసీసీ) ప్రపంచ కప్ ఫైనల్ లో న్యూజిలాండ్ తో జరిగిన హోరాహోరీ మ్యాచ్, తొలుత టై గా ముగిసిన విషయం తెల్సిందే . మ్యాచ్ విజేత ను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ ఆడించగా , అది కూడా టై కావడంతో బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ జట్టును నిర్వాహకులు విజేతగా ప్రకటించారు.
బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించడాన్ని క్రికెట్ అభిమానులు , క్రీడా పండితులు తీవ్రంగా వ్యతిరేకించారు . ఇదేమి నిబంధన అంటూ తిట్టిపోశారు . ఐసీసీ తరుచూ, నిబంధనలను సడలిస్తూ , క్రికెట్ మరింత జనరంజకంగా ఉండేలా చర్యలు చేపడుతూ వస్తోంది . దానిలో భాగంగానే తీవ్ర విమర్శలకు దారితీసిన సూపర్ ఓవర్ నిబంధనను కూడా మార్చాలని నిర్ణయించింది . తాజాగా జరిగిన ఐసిసి పాలకమండలి సమావేశం లో ఈ మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది . సెమీ ఫైనల్ ఫైనల్ మ్యాచ్ లలో మ్యాచ్ టై గా ముగిసి , ఫలితం కోసం సూపర్ ఓవర్ ను ఆశ్రయిస్తే , ఫలితం తేలేవరకు సూపర్ ఓవర్ లను ఆడిస్తూ నే ఉండాలని నిర్ణయించింది.
ఐసీసీ ఫైనల్ లో ఎదురైన అనుభవాన్ని దృష్టి లో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది . నాకౌట్ దశలో ఇప్పటి వరకు మ్యాచ్ టై గా ముగిస్తే సూపర్ ఓవర్లను ఆడిస్తుండగా , ఇకపై లీగ్ దశలోనూ ఆడిస్తారు. సూపర్ ఓవర్ కూడా టై అయితే ఆ మ్యాచ్ ను టైగానే పరిగణిస్తారు. మరోమారు సూపర్ ఓవర్ ఆడించడం అన్నది జరగదని ఐసీసీ ప్రకటించింది .