బిగ్ బాస్ కు షాక్.. షూటింగ్ అడ్డుకున్న పోలీసులు..

Satvika
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రోజు రోజుకు లెక్కకు మించి పాజిటివ్ కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. అంతే రేంజులో మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే ఈ మహమ్మారి ప్రభావం చిత్ర పరిశ్రమపై కాస్త ఎక్కువగానే చూపిస్తుంది. దీంతో సినిమా షూటింగ్ దాదాపు ఆగిపోయింది. విడుదల కావలసిన సినిమాలు కూడా వెనకడుగు వేస్తున్నాయి. ఇక రియాలిటీ షో ల పరిస్థితి కూడా అదే విధంగా మారింది.


విషయానికొస్తే.. ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్న బిగ్ బాస్ షూటింగ్ కూడా నిర్వాహకులు నిలిపివేశారు. ఇది ఇలా ఉండగా సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మలయాళం బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ ఇదివరకే ప్రారంభమైంది. దీంతో దీన్ని మధ్యలో ఆపేయకుండా షూటింగ్‌ కొనసాగిస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి మరీ షో నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో పాల్గొంటున్న 8 మందికి కరోనా సోకిందని వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ వ్యవహారం కాస్తా పోలీసుల దృష్టికి రావడంతో వారు చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌సిటీలో బిగ్‌బాస్‌ సెట్‌కు వెళ్లి చిత్రీకరణను నిలిపివేశారు. హౌస్‌మేట్స్‌ను అక్కడ నుంచి హోటల్‌కు పంపించారు. బిగ్‌బాస్‌ సెట్‌ను మూసివేశారు. కాగా మలయాళ బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది. ఫిబ్రవరి నుంచి ఈ షో ప్రసారమవుతుండగా హౌస్‌లో ఇప్పటికే 95 రోజులు ముగిశాయి.


లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్‌ యధావిధిగా నిర్వహించడంతో తిరువళ్లూరు ఆర్డీవో ప్రీతి పర్కావి మంగళవారం పోలీసులతో అక్కడికి వెళ్లి చిత్రీకరణను అడ్డుకున్నారు. కంటెస్టెంట్లతో సహా కెమెరామెన్లు, టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని పంపించి వేశారు. అనంతరం సెట్‌ను సీల్‌ చేసిట్లు అధికారులు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం షూటింగ్‌లపై నిషేధం విధించినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా చిత్రీకరణ జరిపిన నిర్వాహకులపై కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇకపోతే ఇటు హౌస్ మేట్స్ ఎవరు లేకున్నా జూన్ 4 గ్రాండ్ ఫినాలే జరుగుతుందని చెప్పుకొచ్చారు.. మరి ఈ షో గ్రాండ్ ఫినాలే జరుగుతుందో లేదో తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: