భద్రతా సమస్యల దృష్ట్యా చైనా యాప్స్ను ఇండియాలో కేంద్రప్రభుత్వం నిషేధించిన సంగతి అందరికీ విదితమే. అయితే, యాప్స్ నిషేధంలో ఉన్నప్పటికీ యాప్స్లో కొన్నిటినీ చైనా గుట్టుగా భారతదేశంలో నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఓల్డ్ నేమ్స్కు బదులుగా కొత్త కంపెనీల పేర్లతో యాప్స్ రన్ చేస్తున్నాయట. చాలా కంపెనీలు తమ చైనీస్ మూలాలను దాచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలా కొత్త కంపెనీ పేర్లతో తమ యాప్లను లిస్ట్ చేస్తున్నాయి. అయితే, యాప్ ఓనర్ షిప్ పబ్లిక్ డేటా అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు భారతదేశంలో టాప్ 60 యాప్లలో కనీసం 8 యాప్లు చైనా ఆపరేట్గా కొనసాగుతున్నాయని సమాచారం.
ప్రతీ నెలా 211 మిలియన్లకు పైగా యూజర్లను చేరుకోవాలనేది వీటి లక్ష్యమని ఓ నివేదిక తెలిపింది. జూలై 2020లో చైనీస్ యాప్లు నిషేధించిన తర్వాత అదే యాప్లు 96 మిలియన్ యూజర్లను కలిగి ఉన్నాయి. గత 13 నెలల్లో 115 మిలియన్ కొత్త యూజర్లు చేరినట్లు తెలుస్తోంది. భారత్, చైనాల మధ్య సరిహద్దు, దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో 2020లో భారత ప్రభుత్వం టిక్ టాక్, పబ్ జీ, యూసీ బ్రౌజర్, అలీ ఎక్స్ ప్రెస్, ఎంఐ కమ్యూనిటీ, వీ చాట్, బిగో లైవ్ తదితర యాప్స్పై బ్యాన్ విధించింది. ఈ యాప్స్ ద్వారా భారత పౌరుల గోప్యతకు కూడా భంగం కలిగే అవకాశాలున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇకపోతే చైనాకు సంబంధించిన కొన్ని యాప్లు, డేటా భద్రతతో పాటు పౌరుల భద్రత దృష్ట్యా నిషేధం విధించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
అయితే, చైనా యాప్స్ కొత్త ముసుగులో మళ్లీ భారత్కు వచ్చినట్లు సమాచారం. మొత్తంగా ఈ యాప్ కంపెనీలకు దేశంలో బలం బాగా పెరిగిపోతోంది. చైనా కంపెనీలు భారత యూజర్లే లక్ష్యంగా చేసుకున్నాయని నిపుణులు అనుమానిస్తున్నారు. నిషేధం తర్వాత చాలా యాప్స్.. తొందరగా పెద్ద సంఖ్యలో యూజర్లను చేరుకునేందుకుగాను ఇలాంటి యాప్స్ ఆపరేట్ చేస్తున్నాయని గుర్తించారు. అయితే, కొన్ని యాప్లు కేవలం నెలల్లోనే పదిలక్షల మంది యూజర్లను చేరుకున్నాయి. ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనీస్ యాప్ ప్లేఇట్. కాగా ఈ యాప్ పైరసీని ప్రోత్సహించడం ద్వారా త్వరగా బాగా పాపులర్ అయింది. ఈ యాప్ ద్వారా వీడియోలను ప్లే చేయడమే కాదు.. నెట్ఫ్లిక్స్, ఎంఎక్స్ప్లేయర్, సోనీలివ్ వంటి ఓటీటీ ప్లాట్ఫారమ్ల్లోని మూవీలు, షోల పైరేటెడ్ కాపీలను టెలిగ్రామ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇలా డౌన్ లోడ్ చేసిన మూవీలను ప్లేఇట్ యాప్లో ప్లే చేసే వీలుంటుంది.