ఇప్పుడు కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. చేతిలో ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు..ప్రపంచం నీ ముంగిట్లో ఉన్నట్లే. అంతే కాదు ఒకప్పుడు ఎదుటి వారితో మాట్లాడుకోవాలన్నా..చాట్ చేసుకోవాలన్న తెగ ఇబ్బందులు పడే వారు. వాట్సాప్ యాప్ వచ్చినప్పటి నుంచి మనకు కావాల్సిన లైవ్ వీడియో టాక్ చేసుకునే సదుపాయం కల్పించారు.
ప్రతి ఒక్కరూ ఇప్పుడు వాట్సప్ లేనిదే ఉండలేని పరిస్థితికి వచ్చింది. తాజాగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. అతి త్వరలో నగదు బదిలీ యాప్ను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నాలు ప్రారంభించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)ని ప్రారంభించే పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘వాట్సాప్ పేమెంట్స్ సెక్షన్’ అభివృద్ధి దశలో ఉందని బ్లాగ్ వెబ్సైట్ డబ్ల్యూఏబేటాఇన్ఫో పేర్కొంది. అయితే వాట్సాప్ పేమెంట్స్ను ఉపయోగించుకోవాలంటే తొలుత వాట్సాప్ పేమెంట్స్ అండ్ బ్యాంక్ టెర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీని అంగీకరించాల్సి ఉంటుందని బ్లాగ్ వివరించింది.
ప్రస్తుతం యూపీఐని భారతీయ రిజర్వు బ్యాంకు నియంత్రిస్తోంది. దీనికి 20 కోట్ల మంది మంత్లీ యాక్టివ్ యూజర్లు (ఎంఏయూస్) ఉన్నారు. ఈ సౌలభ్యాన్ని తమ వినియోగదారులకు అందించే ఉద్దేశంతో వాట్సాప్ ఇప్పటికే ఎన్పీసీఐతో చర్చలు జరిపింది. వియ్చాట్, హైక్ మెసేంజర్ వంటి మొబైల్ మెసేజింగ్ యాప్స్ ఇప్పటికే యూపీఐ పేమెంట్ సర్వీసులను అందిస్తున్నాయి.