డాక్టర్ ప్రియాంక రెడ్డి సజీవ దహనం.. ఎలా...???
షాద్నగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువతిని అత్యంత దారుణంగా హత్య చేసి, చెటాన్పల్లి బైపాస్ రోడ్డు అండర్ బ్రిడ్జి కింద పెట్రోలు పోసి దహనం చేశారు. హత్య చేయడానికి ముందు అఘాయిత్యం చేశారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షాద్నగర్ సమీపంలో హత్యకు గురైన మహిళను వెటర్నరి డాక్టర్ ప్రియాంక రెడ్డిగా (22) పోలీసులు గుర్తించారు. నవాబుపేట మండలం కొల్లూరులో ఆమె వెటర్నరీ డాక్టర్గా పనిచేస్తున్నారు. తండ్రి కూడా వైద్యుడేనని తెలుస్తోంది.
ప్రియాంకా రెడ్డి స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ దగ్గర నర్సాయపల్లి. మృతురాలి కుటుంబం ప్రస్తుతం శంషాబాద్లో నివాసం ఉంటున్నారు. ప్రియాంకారెడ్డి ఉదయం స్కూటీ మీద ఆఫీస్కు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఉండగా స్కూటీ పాడైపోయిందని సోదరికి ఫోన్ చేసి చెప్పింది. హైవే పై భయమవుతోందని పోన్ ద్వారా తెలిపింది. ఇంటికి కాల్ చేసిన కాసేపటికే ప్రియాంక ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. తెల్లారేసరికి ప్రియాంకారెడ్డి మృతదేహం కాలి బూడిదైంది.
పింపుల్స్కు సంబంధించిన చికిత్స నిమిత్తం ప్రియాంక రెడ్డి నవంబర్ 27 సాయంత్రం మాదాపూర్లోని ఓ క్లినిక్కు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే తాను రోజూ వినియోగించే కారు కాకుండా కుటుంబ సభ్యులకు చెందిన స్కూటీ పై అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. చీకటి పడుతున్నా తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన ప్రియాంక సోదరి ఆమెకు ఫోన్ చేయగా.. ట్రీట్ మెంట్ అనంతరం తిరిగి వస్తుండగా స్కూటీ టైర్ పంక్చర్ అయిందని తెలిపినట్లు పోలీసులకు చెప్పారు. చీకటి పడుతోందని ఆందోళనకు గురైందని.. రహదారి పక్కనే లారీ డ్రైవర్లు కూడా ఉన్నారని భయాందోళన వ్యక్తం చేసిందని ఆమె సోదరి తెలిపారు.
ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి శంషాబాద్ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆమెకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం ఉదయం షాద్ నగర్ లో చటాన్పల్లి బ్రిడ్జి వద్ద ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ప్రియాంక కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. ప్రియాంక దుస్తులు, ఆమె మెడలోని నెక్లెస్ ఆధారంగా ఆ మృతదేహం ఆమెదేనని గుర్తించారు. తమ కుమార్తె అత్యంత దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసి ప్రియాంక తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. ప్రియాంక మరణం పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియాంక మర్డర్ మిస్టరీ తేల్చేందుకు మొత్తం 15 బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్లు షాద్నగర్ ఏసీపీ సురేందర్ తెలిపారు.