ప్రస్తుత కాలంలో ఆడ బిడ్డ పుట్టింది అంటే చాలు కొంతమంది భారంగా భావిస్తున్నారు. వారిని పురిట్లోనే చిదిమేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలను చెత్తకుప్పల పై, వదిలేసి వెళుతున్నారు. ప్రస్తుత కాలంలో మారుతున్న సమాజంలో ఆడపిల్లలు ఆకాశానికి సైతం వెళ్లి వస్తున్నారు. అలాంటి ఈ రోజుల్లో ఇలా ఆడ ,మగ వివక్ష అనేది ఉండటం చాలా దారుణం. ఆడపిల్లకు పుట్టినప్పటినుంచి భద్రత అనేది కరువైందని చెప్పవచ్చు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు బట్టి చూస్తే ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగాయి. అలాగే ఆడపిల్లలపై వివక్ష కూడా పెరిగిపోయింది. కానీ ఆడపిల్ల అంటేనే అబసు పాలు చేస్తున్న కొంతమందికి ఈ తండ్రి ఆదర్శం అని చెప్పవచ్చు. అతను ఒక పానీపూరి వ్యాపారి.
పానీ పూరి బండి నడిస్తే కానీ తన కడుపు నిండదు. అలాంటి ఆ వ్యక్తి తనకు ఆడపిల్ల పుట్టిందని తన స్థోమతకు మించి సంబరాలు జరుపుకున్నారు. ఎవరా వ్యక్తి.. ఏం చేశాడు..? అయితే ఆయన హంగులు ఆర్భాటాలు ఏమి చేయలేరు. తను చేసినటువంటి పనిని చూసి అందరూ మెచ్చుకున్నారు. ఇలాంటి తండ్రి మన సమాజానికి ఎంతో అవసరమని కామెంట్స్ కూడా చేశారు. ఇంతకీ ఆయన ఏం చేశారు..? కోలార్ పట్టణంలోని అంచల్ గుప్తా పానీపూరి వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి ఆగస్టు 17 వ తేదీన పండంటి ఆడపిల్ల పుట్టింది. విషయం తెలుసుకున్న ఆయన సంతోషానికి ఏమి అడ్డు రాలేదు. ఈ సంతోషాన్ని ఎలాగైనా బయట వ్యక్త పరచాలని నిర్ణయించుకున్నాడు. అదే పట్టణంలో 50 వేల రూపాయలు ఖర్చు చేసి ఎంతోమందికి ఉచితంగా పానీపూరి అందించి తన బిడ్డ పై ప్రేమను చాటుకున్నారు.
తనకు బిడ్డ పుట్టిందని అందుకోసమే పానీ పూరిని ఉచితంగా ఇస్తున్నానని వారికీ వెల్లడించారు. దీంతో అతన్ని అందరూ ఎంతో మెచ్చుకున్నారు. తాను వివాహం చేసుకున్న మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటున్నానని కానీ మగపిల్లాడు పుట్టాడు అని, రెండో సంతానంలో ఆడపిల్ల జన్మించడం చాలా ఆనందంగా ఉందని, అలాగే తన బిడ్డ పుట్టిన రోజు తన కొడుకు రెండో పుట్టినరోజు కూడా రావడం విశేషం అన్నారు. అమ్మాయిలు ఉంటేనే భవిష్యత్ తరాలు ఉంటారని తన సందేశాన్ని అందరికీ చాటాలని ఇలా చేశానని ఆయన చెప్పుకొచ్చారు. మగపిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు సమానులే అని, వివక్ష అనే చూపించకూడదని ఆయన తెలిపారు.