ఏపీ: డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో ఉన్న శాఖకు ప్రపంచ రికార్డ్.!

FARMANULLA SHAIK
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజులలోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది. ఆగస్టు 23వ తేదీన ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. రూ.4500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ఆ శాఖకు ప్రపంచ రికార్డు దక్కింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభలను గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డు సర్టిఫికెట్, మెడల్ ను ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందచేశారు. హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ రికార్డు సర్టిఫికెట్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అందజేశారు. గ్రామ స్వరాజ్యం దిశగా ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.ఈ నేపథ్యంలో గ్రామాలకు స్వపరిపాలన అందించాలనే ఆకాంక్షతో మొదలైన ఈ ప్రయాణంలో ఈ కొత్త మైలురాయిని అందుకోవడం ఆనందంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామసభలు విజయవంతం చేయడంలో భాగస్వాములైన అధికార యంత్రాంగానికి, స్థానిక సంస్థల ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గ్రామసభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామసభల్లో భాగస్వాములైనందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి డైరెక్టర్ శ్రీ కృష్ణ తేజ, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ శ్రీ షణ్ముఖ్, సంయుక్త కమిషనర్ శ్రీ శివప్రసాద్ పాల్గొన్నారు.
గ్రామ స్వరాజ్యం కోసం ఏపీ ప్రభుత్వం బలంగా అడుగులు వేస్తోంది.

ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గ్రామాల అభివృద్ధిపై చిత్తశుద్ధితో, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక సంస్థల పాలన బలంగా ఉండాలన్నదే ప్రధాన ఆలోచనగా ఉన్నారు. గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు ఆయా గ్రామస్థులే నిర్ణయించుకునే అధికారం ఉందని, గ్రామసభల్లో చర్చించి తీర్మానం చేసుకోవాలని ఆకాంక్షించారు. గ్రామీణుల్లో గ్రామసభల తీరు తెన్నులపై చైతన్యం కలిగించడంలో ఆయన ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు స్వపరిపాలన, సుపరిపాలన దిశగా అడుగలు వేస్తున్నాయి. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించి ‘స్వర్ణ పంచాయతీ’లుగా అభివృద్ధి చెందేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యం.ఇదిలావుండగా 87 విభిన్న పనులకు సంబంధించి తీర్మానాలు చేశారు. ఈ పనుల వల్ల 9 కోట్ల మందికి ఉపాధి లభించేలా, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి ఫలాలు అందేలా గ్రామసభల్లో నిర్ణయాలు జరిగాయి.గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, పశువుల పాకలు, చెరువుల పూడికతీత, హార్టికల్చర్ పనులు, చెక్ డ్యాం నిర్మాణం, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు తదితర పనులను చేసుకునేందుకు గ్రామస్థులంతా ఒకేసారి రాష్ట్రంలో ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామసభలను తూతూమంత్రంగా నిర్వహించకుండా గ్రామీణులంతా కలిసి కూర్చొని చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకునేలా చైతన్యం కలిగించింది. మహిళలు, యువత గ్రామసభలకు తరలివచ్చి గ్రామానికి ఏమి అవసరమో దానిపై చర్చించి, తీర్మానం చేసేలా ప్రోత్సహించింది. ఫలితంగా ఈ గ్రామ సభల నిర్వహణ దేశంలోనే జరిగిన అతి పెద్ద గ్రామపాలన కార్యక్రమంగా ప్రపంచ రికార్డులకెక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: